ప్రచురణార్ధం
అంగన్వాడీ కేంద్రాల పనితీరు నిర్వహణ మెరుగవ్వాలి…
మహబూబాబాద్, సెప్టెంబర్,22.
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ లో సిబ్బంది పనితీరు మెరుగవ్వాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఐ.సి.డి.ఎస్ కార్యకలాపాలలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, బాలల పరిరక్షణ, తదితర విభాగాల పనితీరును కలెక్టర్ సమీక్షించారు.
ముందుగా ఐ.సి.డి.ఎస్. లపై సమీక్షించగా జిల్లాలోని 5 ప్రాజెక్టుల పరిధిలోని 1430 అంగన్ వాడి కేంద్రంలలో 42,118 మందికి పౌష్టికాహారం అందుతున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.
మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రుర్, గూడూరు కేంద్రాలలో ఐ.సి.డి.ఎస్.ప్రాజెక్ట్ లున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లలో 11,500 మంది గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం పొందుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు ఎక్కువగా ఉన్న అంగన్ వాడి సెంటర్లను మండలానికి 2 చొప్పున మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా చేపట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
అంగన్ వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న వస్తువులపై అధికారులు దృష్టి పెట్టాలని, నెల వారి నివేదికలు ఇవ్వాలన్నారు.
బాలల పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని బాల్య వివాహాలు జరగకుండా నిఘా అవసరమన్నారు. బేటీ బచావో…బేటీ పడావో కార్యక్రమంలను ముమ్మరం చేయాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, ఐ.సి.డి.ఎస్. సి.డి.పి.ఓ. డెబోరా ,బాలల పరిరక్షణ అధికారి కమలాకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
—————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది