అగ్ని ప్రమాదాల నివారణ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్
ఎస్ .వెంకటరావు అన్నారు.
సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ, జడ్చర్ల పోలేపల్లి సెజ్ లోని ఎస్ వి కె ఎం పాఠశాల విద్యార్థులు సంయుక్తంగా అగ్ని ప్రమాదాల నివారణ పై ఏర్పాటు చేసిన అగ్ని ప్రమాదాల నివారణ ప్రదర్శనను ఆయన తిలకించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వంటగదులలో, ఫ్యాక్టరీలలో తదితర ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయని, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎలా నివారించుకోవాలో అగ్నిమాపక శాఖ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించడం పట్ల ఆయన అగ్ని మాపక శాఖ సిబ్బందిని,ఎస్ వి కె ఎం పాఠశాల విద్యార్థులను అభినందించారు. ప్రతి ఒక్కరు వారి వారి ఇండ్లలో వంట సోడా 4,5 కిలోలు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రమాదం జరిగినప్పుడు తినే సోడాను ఉపయోగించి అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రజావాణి సందర్భంగా ప్రజావాణి కి వచ్చే ప్రజలతోపాటు, అధికారులు ,సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సోమవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇదే కార్యక్రమాన్ని తిరిగి గణతంత్ర దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలని ఆయన ఆగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ ను ఆదేశించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా అధికారులు,ఎస్ వి కె ఎం పాఠశాల ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.