అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి 5వ విడత పల్లె ప్రగతిని విజయవంతం చేద్దాం – జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య
జిల్లా వ్యాప్తంగా 5వ విడత పల్లెప్రగతిని విజయవంతం చేయాలని జడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య అన్నారు. జూన్ 3వ తేదీ నుండి జూన్18వ తేదీ వరకు నిర్వహించనున్న ఐదో విడత పల్లెప్రగతి నిర్వహణపై సన్నాహక సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆమె ఎంపీడీఓలు, ఎంపిఓలు, అధికారులకు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర సిబ్బంది పల్లెల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు.
పల్లెప్రగతి ప్రారంభం రోజున గ్రామాల్లో పాదయాత్రలు, గ్రామసభలు నిర్వహించి సీఎం సందేశాన్ని చదివి వినిపించాలన్నారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని, ఒకరోజు పవర్డే పాటించి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలన్నారు. తాగునీటి వనరులను గుర్తించి శుభ్రం చేయాలని, డంపింగ్యార్డు, వైకుంఠధామాలను సందర్శించాలన్నారు. గ్రామస్థుల సహకారంతో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. పాడుబడిన, నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేయాలని, ఇళ్ల శిథిలాలను తొలగించాలన్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇందులో ప్రధాన భూమిక పోషించాలని ఆమె సూచించారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణలో ఈ ఏడాది వరకు 7.5 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా గ్రీనరీ ఇంతలా పెరగలేదన్నారు.
దేశంలో అటవీ విస్తీర్ణం పెంచడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. కేవలం తెలంగాణలోనే రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపు పై దృష్టి సారించిందన్నారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి,సంరక్షించే ప్రోత్సాహించాలన్నారు. అలాగే జూన్3వ తేదీ లోపు గత ఏడాది ప్రణాళికలో మిగిలిన పనులపై అవగాహన చేసుకుని వాటిపై దృష్టి సారించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ, హరితహారం కింద పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లెప్రగతిని విజయవంతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ఉష, డిప్యూటీ సీఈవో భాగ్యలక్ష్మి, డీఆర్డీఏ పీడీ నర్సింగ్ రావు, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, అదనపు పీడీ రాజేశ్వరి, డిఎల్పిఓ రామ్మోహన్ రావు, ఎంపీడీవోలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.