*ప్రచురణార్థం-1*
*అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అందాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*
జయశంకర్ భూపాలపల్లి, మే 5: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్దిదారులకు సకాలంలో అందేలా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో జిల్లా స్థాయి డిసిసి, డిఎల్ఆర్సి సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. 2021-22 సం. నికి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు, సాధనలు, ప్రభుత్వ వివిధ శాఖల సబ్సిడీ ఋణాల అందజేతపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధి యూనిట్లకు సబ్సిడీ విడుదల చేసిన వాటిని బ్యాంకర్ లు లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేయాలన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం లో మార్చి 31 వరకు 874 కోట్ల 54 లక్షల పంట రుణాలు లక్ష్యం కాగా, 637 కోట్ల 37 లక్షల రూ.లు (72.88%) పంట రుణం కింద రైతులకు మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ టర్మ్ రుణాలు 383 కోట్ల 18 లక్షలు లక్ష్యం కాగా, 40 కోట్ల 46 లక్షల రూ.లు (10.56%) అందజేశామన్నారు. ఎంఎస్ఎంఇ క్రింద 116 కోట్ల 99 లక్షలకుగాను రూ. 45 కోట్ల 92 లక్షలు సాధించామన్నారు. విద్యా రుణం కింద 11 కోట్ల 3 లక్షల లక్ష్యం కాగా 5 కోట్ల 83 లక్షలు రుణం అంద చేసినట్లు వెల్లడించారు. గృహ ఋణాల క్రింద 33 కోట్ల 98 లక్షల లక్ష్యానికి 15 కోట్ల 47 లక్షలు మంజూరు చేసినట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ. ఒక వేల 555 కోట్ల 50 లక్షల లక్ష్యానికి గాను 772 కోట్ల 6 లక్షల (49.63%) సాధించినట్లు ఆయన తెలిపారు. సన్న, చిన్న కారు రైతులు పంట రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు రుణ మాఫీ తో సంబంధం లేకుండా పంట రుణాలు రెన్యువల్ చేసుకోనెలా, సకాలంలో తిరిగి చెల్లిస్తే, వడ్డీ పడదని, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు రుణాలు అందించాలని బ్యాంకర్లకు
సూచించారు. బ్యాంకుల ద్వారా అమలు చేసే వివిధ పథకాల కింద అందించే ఆర్థిక సహాయం సకాలంలో అందించినట్లయితే వారు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ దిశగా బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. పంట రుణాల పంపిణీ , వ్యవసాయ కాల పరిమితి రుణాలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గృహ రుణాల వంటివాటి విషయంలో ఉదారత్వంతో బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రుణాలు పొందిన వారు, ఆయా ఋణాలను సద్వినియోగం చేసుకున్నది, లేనిది పర్యవేక్షణ చేయాలన్నారు. దళితబంధు పథకం జిల్లాలో అమలుచేస్తున్నట్లు, ఈ పథకం క్రింద 60 నుండి 70 రవాణా యూనిట్లు వారంలోగా గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మిగతా రవానేతర యూనిట్ల గ్రౌండింగ్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ దిశగా చేపడుతున్న అక్షరాస్యత శిబిరాలు ముమ్మరం చేసి, ఆర్ధిక మోసాలకు ప్రజలు గురికాకుండా చైతన్యం తేవాలన్నారు.
సమావేశంలో ప్రాధాన్యత రంగాలకు ఒక వేయి 723 కోట్ల 82 లక్షలు, అప్రధాన్యతా రంగాలకు 213 కోట్ల 52 లక్షలు మొత్తంగా ఒక వేయి 937 కోట్ల 34 లక్షల లక్ష్యంతో 2022-23 వార్షిక ఋణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక వేయి 551 కోట్ల 2 లక్షలు లక్ష్యంగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఎల్డిఎం శ్రీనివాసరావు, ఎస్బిఐ ఏజీఎం ఎండి. అలీమోద్దీన్, ఎపిజివిబి ఆర్ఎం శ్రీధర్ రెడ్డి, టిజిబి అసుర్ఎం చంద్రశేఖర్, ఆర్బీఐ ఎల్డివో సాయి చరణ్ నాబార్డు ఏజీఎం చైతన్య రవి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ నాను నాయక్, డిఆర్డీవో పురుషోత్తం, జిఎం ఇండస్ట్రీస్ శ్రీనివాస్, జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.