మహబూబాబాద్, ఏప్రిల్ -27:
ఇంటర్, ఎస్.ఎస్.సి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి ఇంటర్మీడియట్, ఎస్.ఎస్.సి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షలు మే-6 నుండి 19 వరకు, మే -23 నుండి జూన్ ఒకటి వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించుటకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో (19) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంటర్ మొదటి సంవత్సరం 6033 మంది, ఇంటర్ రెండవ సంవత్సరం 5611 మంది, మొత్తం 11644 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, అలాగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు (56) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 9289 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని, పరీక్షా కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని, పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ టీమ్ ను ఏర్పాటు చేసి ఓ.ఆర్.ఎస్. పాకెట్ లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్థులు వచ్చే సమయంలో చెకింగ్ నిమిత్తం సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు.
పరీక్షా హాలులో అనుమతించని, అనుమతించే వాటిపై, సమయపాలన పై విద్యార్థులకు ముందుగా సమాచారం అందించాలని తెలిపారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సకాలంలో బస్సులను ఏర్పాటు చేయాలని, విద్యా శాఖ, సంబంధిత అధికారులతో పరీక్షా సమయం విషయం సమన్వయం చేసుకొని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ప్రశ్న పత్రాలను పోలీసు బందోబస్తు తో పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, సెంటర్ కు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు అయిన వెంటనే జవాబు పత్రాలను పోస్టల్ శాఖ లో జమ చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎస్. సత్యనారాయణ, డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ ఆర్. ప్రభాకర్, ఆర్టిసి డిపో మేనేజర్ బి.శ్రీనివాస్, డిప్యూటీ డి.ఎం. అండ్ హెచ్. ఓ. డాక్టర్ అంబరీష, పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సి.సతీష్ బాబు, టి.ఎస్.ఎన్.పి. డి.సి. ఎల్. – ఎస్.ఈ. డి. సునీత దేవి, తదితరులు పాల్గొన్నారు.