ప్రచురణార్థం
ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
*మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు
*రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం నెంబర్ 040-24601010 ఏర్పాటు
*విద్యార్థుల కోసం టెలి మానస్ నెంబర్ 14416 ద్వారా ఉచిత కౌన్సిలింగ్ సదుపాయం
*జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు కంట్రోల్ రూం నంబర్ 8977081640 ఏర్పాటు
*విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
*ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
*ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం
——————————
వరంగల్, మార్చి – 13:
——————————
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించు ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంబందిత అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ లతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, సంభందిత అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్సవ కోట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవరావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ వార్షిక పరీక్షలను కట్టుదిటమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించాలని, అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ లు నిరంతరం పర్యవేక్షిస్తూ పరీక్షలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేకంగా టెలీ మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను ఏర్పాటు చేసిందని, పరీక్షల సమయంలో ఆందోళనకు, టెన్షన్ కు గురయ్యే విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే మానసిక నిపుణులు, వైద్యులు ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, ఈ సదుపాయం పై విద్యార్థుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, అలాగే రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, 040-24601010 నెంబర్ నందు సందేహాల నివృత్తి కోసం సంప్రదించాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులకు వివిధ రకాల సేవలు అందించేందుకు TSBIE M సర్వీసెస్ మొబైల్ యాప్ వినియోగించుకోవాలని , పరీక్షా కేంద్రం వివరాలు ఆ యాప్ లో ఉంటాయని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *జిల్లా కలెక్టర్ డాక్టర్
బి గోపి మాట్లాడుతూ,* జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు గాను 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, తగిన ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోడం జరిగిందని, సందేహాల నివృత్తి కోసం జిల్లాలో 8977081640 నంబర్ తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసామని, ముందుగానే సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని ప్రత్యేకమైన సమస్యలు ఏమి లేవని హాల్ టికెట్ ఇష్యూ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే నివృత్తి
చేసుకుంటామని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.
విద్యార్థులు దూర ప్రాంతాల నుండి ఆర్టీసి బస్సులలో ఉదయం 8 గంటలలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా, పరీక్ష ముగిసిన వెంటనే తిరిగి వెళ్ళే విధంగా బస్సులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు.
పరీక్షా హాలులో విద్యార్థిని, విద్యార్థులను విడివిడిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని, ఇందుకు గాను ఇంటర్ అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని, ఆరోగ్య సంబంధమైన సమస్యలు విద్యార్థులకు తలెత్తకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని మందులతో అందుబాటులో ఉంచాలని, పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని, త్రాగునీటి వసతి, పరిశుభ్రత నిర్వహణ గురించి మున్సిపల్ కమిషనర్లు, డి.పి.ఓ. చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రశ్నాపత్రాలను పోలీసు బందొబస్తు ద్వారా పరీక్షా కేంద్రాలకు, పరీక్ష ముగిసిన తర్వాత పోస్టల్ శాఖకు జవాబు పత్రాలను సీల్ చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో తరలించాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరిగే విధంగా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించాలని, జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు పని తీరును ముందస్తుగా పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.
—————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, వరంగల్ వారిచే జారీ చేయనైనది.