ప్రచురణార్ధం
అక్టోబరు 21,ఖమ్మం –
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్ తెలిపారు. ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రరెడ్డి, ఉన్నత విద్యాశాఖ: రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకై చేసిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ వివరించారు. జిల్లాలో 17,738 మంది విద్యార్థులు: పరీక్షలకు హాజరవుతారని, వీరికి జిల్లాలో 76 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షల నిర్వహణకు గాను 76 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 76 మంది డిపార్ట్మెంట్ అధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృంధాలు, 10 మంది సిట్టింగ్ స్క్వాడ్ ను నియమించడం జరిగిందని అన్ని పరీక్ష కేంద్రాలలో సి.సి.టివి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ వివరించారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఇప్పటికే జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశం, హైపవర్ కమిటీ సమావేశాలు నిర్వహించి అనుబంధ శాఖాధికారులను ఆదేశించి అన్ని ఏర్పాట్లతో పరీక్షలకు సన్నద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు ఆదేశాలు చేసారు. విద్యార్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు వ్రాసేవిధంగా ఏర్పాట్లు ఉండాలని మంత్రి అన్నారు. ప్రధానంగా కోవిడ్ 19 నిబందనలను. ఖచ్చితంగా పాటించాలని, పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలన్నారు. పరీక్షా కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రం ఏర్పాటుతో పాటు అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరయ్యే విధంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్.టి.సి. బస్సులను నడపాలని, అకాల వర్షాలు సంభవించినప్పటికీ విద్యార్థులకు ఎటువంటి అంతరాయం లేకుండా పరీక్షకు హాజరయ్యెలా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకై కనీస వసతులు సమకూర్చాలని, అన్ని పరీక్షా కేంద్రాలలో సి.సి.టివి కెమోరాలు తప్పనిసరిగా ఏర్పాటు. చేయలన్నారు. మాల్ ప్రాక్టీస్ జరుగకుండా పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, రూట్, మ్యామ్యాప్లను నిర్దేశించుకొని, ఫ్లయ్యింగ్ స్క్వాడ్ సమన్వయంతో, ప్రశ్నాపత్రాలు, పరీక్షల అనంతరం జవాబు పత్రాలను సంబంధిత స్టోరేజ్ కేంద్రాలకు తరలించాలని మంత్రి తెలిపారు. పరీక్ష సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని, పరీక్షా కేంద్రాల సమీపంలోని జీరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, 144 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు.
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శీరిష, జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, ఏ.సి.పి ప్రసన్నకుమార్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు రమేష్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.