ఉపాధిహామీ లో పని కోరుకునే ప్రతి ఒక్కరికి పని కల్పించి కూలీల పని పనిదినాలు పెంచాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపిడిఓ లను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ మనుచౌదరితో కలిసి ఉపాధిహామీ, హరితహారం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఒక్కో మండలం వారిగా గత సంవత్సరం మొత్తం సాధించిన పని దినాలు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు సాధించిన సరాసరి పనిదినాల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ పని దినాలు సాధించిన ఎంపిడిఓ ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో తరచుగా శ్రమ శక్తి సంఘాల సబ్యులతో సమావేశాలు నిర్వహించి కూలీలను ప్రోత్సహించి పనిదినాలు పెంచాలన్నారు. గ్రామ ప్రజలకు అవసరమయ్యే వ్యవసాయ పనులు, పొలాల్లో, చెరువులు, కాలువల్లో పూడికతీత పనులు వంటివి చేపడితే తప్పకుండా కూలీల సంఖ్య పెరుగుతుందన్నారు. అంతేతప్ప ప్రజలకు అక్కరకు రాని పనులను చేపడితే ఉత్సాహం చూపించరన్నారు. వచ్చే సమావేశానికి ఎంపిడిఓ ల పారామీటర్ వారిగా నివేదిక ఇవ్వాలని డి.ఆర్.డి. ఓ ను ఆదేశించారు. వెలదండ, అచ్ఛంపేట మండలాల్లో పనిదినాలు మెరుగ్గా సాధించారని ప్రశంసించారు. మిగిలిన మండలాల్లో పనిదినాలు పెంచకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెంచుపెంటల్లో నివసించే వారికి జాబ్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. ఎంపీ.డి.ఓ ల పై పర్యవేక్షణ పెంచాలని డి.ఆర్.డి.ఓ ను ఆదేశించారు. వచ్చే సమావేశానికి బాగా పని చేసే ఎంపిడిఓ లను సన్మానిస్తామని, పనితనం మెరుపరుచుకొని ఎంపిడిఓ లను సరెండర్ చేస్తామని హెచ్చరించారు.
గిరివికాసం పథకం కింద గిరిజన రైతులకు బోరు బావి కావాలనుకున్న రైతుల నుండి దరఖాస్తులు తీసుకొని వెంటనే డి.ఆర్.డి.ఏ కార్యాలయానికి పంపించాలని ఎంపిడిఓ లను ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వాటిలో తిరస్కరణకు గురియైన వాటిని పరిశీలించి పొరపాట్లను సవరించి తిరిగి సమర్పించాలని ఆదేశించారు.
హరితహారం పై మాట్లాడుతూ త్వరలో రుతుపవనాలు రాబోతున్నాయని, హరితహారంలో మొక్కలు నాటేందుకు సన్నద్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, పి.డి. డి.ఆర్.డి.ఏ నర్సింగ్ రావు, పి.ఓ ఐ.టి.డి.ఏ అశోక్, జడ్పి సి.ఈ.ఓ ఉషా, ఏ.పి.డి రాజేశ్వరి, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.