పత్రిక ప్రకటన
తేది: 26-1-2023
నాగర్ కర్నూల్ జిల్లా.
ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా లభించిన స్వాత్రంత్ర్యాన్ని పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అమోదకరమైన రీతిలో ఫలాలు అనుభవించడానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్పీ కె. మనోహర్ తో కలిసి జాతీయ పతాకవిష్కరణ గావించిన కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన వేదిక నుండి జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ది, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
షెడ్యూలు కులాల అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పైలట్ ప్రాజెక్టు కింద చారగొండ మండలాన్ని ఎంచుకొని మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. దీనితో పాటు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుండి వంద కుటుంబాలకు దళితబంధు పథకం అందించినట్లు తెలియజేసారు. జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా 49,336 పెండింగ్ దరఖాస్తులకు గాను 41,432 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లాలో రైతుబందు కింద 2.88 లక్షల మంది రైతులకు 3195 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమచేసినట్లు తెలిపారు. జిల్లాలో వివిధ కారణాల చేత చనిపోయిన 4097 రైతులకు రూ 5 లక్షల చొప్పున రైతు భీమా చెల్లించడం జరిగింది. ఆయిల్ పామ్ తోటల సాగు కై సబ్సిడీ ద్వారా మొక్కలు అందించి 2వేల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు తెలిపారు. 75 శాతం సబ్సిడీ పై గొల్ల కురుమలకు జిల్లాలో 19,127 గొర్రెల యూనిట్లను అందజేసినట్లు తెలిపారు. సాగునీటి ద్వార విస్తీర్ణం పెంచడానికి పులిజాల నుండి చంద్రసాగర్ చెరువుకు బ్రాంచ్ కెనాల్ నిర్మాణం కొరకు 107.20 కోట్లు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. మార్కండేయ ఎత్తిపోతల పథకం కొరకు 76.95 కోట్ల పరిపాలన అనుమతి ఇచ్చినట్లు తెలియజేసారు. అంధత్వ నివారణకై జిల్లాలో 50 బృందాలను ఏర్పాటు చేసి వంద రోజుల్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్భిణీలలో వచ్చే రక్తహీనతను నివారించడానికి జిల్లాలో 2749 న్యూట్రిషన్ కిట్లను గర్భిణీలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో కల్యాణ లక్ష్మీ ద్వారా 3751, షాదీముబారక్ పథకం ద్వారా 176 మందికి చేయూత అందించినట్లు తెలిపారు.
జిల్లాలో విద్యాభివృద్ధికై మన ఊరు మనబడి కింద మొదటి విడతలో 214 పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఇందులో 30 పాఠశాలలు ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐ.టి.డి.ఏ మన్ననూర్ ద్వారా చెంచులకు 102 ఇండ్లు మంజూరు అయ్యాయని వీటిని ఆర్.ట్.డి సహకారంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. గిరిపోషణ పథకం ఇక్రిశాట్ ద్వారా ప్రతినెలా 1716 మంది చెంచులకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అర్హత సాధించే విధంగా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక పునరావాసం కింద 27 మంది దివ్యంగులకు 17.20 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. దేశంలోనే 5వ అతిపెద్ద పెద్దపులుల అభయారణ్య రక్షిత ప్రాంతములో 24 పెద్ద పులులు,118 చిరుత పులులు ఇతర జంతువులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హరితహారంలో ఇప్పటి వరకు జిల్లాలో 6.21 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 1.31 లక్షల మంది కూలీలకు 34.21 లక్షల పనిదినాలను కల్పించడం జరిగింది. 1841 స్వయం సహాయక సంఘాలకు 36.85 కోట్ల రుణ సదుపాయం కల్పించడం జరిగింది. పారిశ్రామిక అభివృద్ధికి జిల్లాలో 43 పరిశ్రమలను స్థాపించడానికి రుణాలు మంజూరు చేసినారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటంలో పోలీస్ శాఖ చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునెందుకు అధికారులు, ప్రజాప్రతినిదులు సమన్వయంతో పనిచేద్దామని కోరారు. అంతకు ముందు జిల్లాకు సంబంధించిన స్వతంత్ర సమరయోధురాలు అంబటి నిలావతి ని కలెక్టర్ సత్కరించారు.
అనంతరం ఆయా శాఖల్లో విశేషంగా కృషి చేసి జిలా అభివృద్ధిలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ కె. మనోహర్, ప్రభుత్వ విప్ అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ శాంతికుమారి తో కలిసి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ కె. మనోహర్, ప్రభుత్వ విప్ అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు, జడ్పి చైర్మన్ శాంతికుమారి, ఆదనపు కలెక్టర్ మను చౌదరి, ఆదనవు కలెక్టర్ మోతిలాల్, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
—————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.