@ ఏనుగొండ బస్తి దవాఖానలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరం లో మాక్ డ్రిల్ ను పరిశీలించిన -జిల్లా కలెక్టర్
ఎస్. వెంకటరావు
@ కంటి వెలుగు వైద్య శిబిరాలలో అన్ని సౌకర్యాలు ఉండాలి
@ ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలి -జిల్లా కలెక్టర్
ఈనెల 19 నుండి నిర్వహించనున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి గుర్తించిన కంటి వెలుగు శిబిరాలలో ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం సౌకర్యాలు ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు.
మంగళవారం ఆయన మహాబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఏనుగొండ బస్తీ దౌఖానాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరం లో మాక్ డ్రిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వైద్య శిబిరానికి కంటి పరీక్ష కోసం వచ్చే వారు ముందుగా విచారణ, సమాచార సేకరణ టేబుల్ నుండి మొదలుకొని కంటి వెలుగు వైద్యాధికారితో పరీక్ష చేయించుకోనే టేబుల్,యంత్ర పరికరం ద్వారా కంటిచూపు స్థాయిని తెలుసుకోవడం ,అదేవిధంగా సైట్ కు సంబంధించిన అద్దాల ద్వారా వారి కంటిచూపు సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం, అనంతరం మందుల చీటీ తీసుకున్న తర్వాత కళ్లద్దాల పంపిణీ వంటి అన్ని టేబుల్ లను తనిఖీ చేయడమే కాకుండా, వైద్య సిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేంద్రానికి వచ్చిన ఒకరిద్దరి ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా కంటి వెలుగులో కంటి వైద్య పరీక్షల నిమిత్తం ప్రక్రియను దగ్గరుండి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలలో కంటి పరీక్ష వైద్య శిబిరాలలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ,ఇది పూర్తిగా నిర్వాహకులపై ఆధారపడిందని తెలిపారు. అంతేకాక స్థానిక ప్రజాప్రతినిదులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కంటి వెలుగు పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు వైద్యులు,ఏ ఎన్ ఎం తో సహా ఆశ, అంగన్వాడి తదితర కార్యకర్తలందరూ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
కంటి వెలుగు వైద్య శిబిరాలకు వచ్చే వారు తప్పని సరిగా ఆధార్,సెల్ ఫోన్ నంబర్ తో సహా రావాలని కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ డాక్టర్ ,డాక్టర్ శశికాంత్ ,కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి మోతిలాల్, డాక్టర్ రఫీ తదితరులు ఉన్నారు .