ఓటరు జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు ప్రతి ఓటరు తమ ఓటర్ కార్డు కు ఆధార్ తో అనుసంధానం చేయించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కోరారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితాలో ఓటరు తన ఆధార్ నెంబరు అనుసంధానం విషయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 లో జరిగిన సవరణల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ ఆగస్టు 1వ తేదీ నుండి ఓటర్లు తమ ఓటర్ ఐడి కార్డు కు ఆధార్ కార్డు ను అనుసంధానం చేసుకునేందుకు ERONET, GARUDA, NVSP, VHA మొదలగు ఆన్లైన్ సేవల ద్వారా నేరుగా ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు. వీటికి తోడు బూత్ లెవల్ అధికారులకు ఫారం 6 (బి) ఇవ్వడం జరుగుతుందని వారు ప్రతి ఇంటికి తిరిగి ఆధార్ వివరాలు సేకరించేందుకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు సైతం బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకొని ఓటర్లకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ ఆధార్ కార్డు అనుసంధానం చేసుకునే విధంగా చూడాలని సూచించారు. ప్రస్తుతం ఆధార్ అనుసంధానం ప్రక్రియ తప్పనిసరి కాకపోయినప్పటికిని ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలనుకునే ప్రతి ఓటరు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ ఓటర్ కార్డు కు ఆధార్ కార్డ్ తో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 659,280 మంది ఓటర్లు ఉన్నారని ఏప్రిల్ 1, 2023 లోపు స్వచ్చందంగా ప్రతి ఒక్కరూ ఆధార్ అనుసంధానం చేసుకునే విధంగా తమ వంతు కృషి చేయాలన్నారు. అదేవిధంగా స్పెషల్ సమ్మరి రివిజన్-2023 షెడ్యూల్ పై సైతం అవగాహన కల్పించారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, పోలింగ్ స్టేషన్ల మార్పుల పై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు, 4 నుండి అక్టోబర్ 24 వరకు సరి చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు తన పేరును జాబితాలో నమోదు చేసుకునేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి అప్డేషన్ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపడుతుందన్నారు. కొత్తగా నమోదు చేసుకునేవారు ఫారం 6 తో పాటు 6 బి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోతిలాల్ నాయక్, ఆర్డీఓ నాగలక్ష్మి, సి. సెక్షన్ సూపరిండెంట్ తబితా, నాగర్ కర్నూల్ తహసిల్దార్ ఆంజనేయులు, డి.టి. సుదర్శన్, రాజకీయా పార్టీల ప్రతినిధులు వై.ఎస్.ఆర్.సి.పి నుండి మొహమ్మద్ హుస్సేన్, లక్ష్మయ్య, బి.జే.పి నుండి సుధాకర్ రెడ్డి, చందు, కాంగ్రెస్ నుండి ఏ. రవి కుమార్, ఎం.ఐ.యం నుండి అలీ హసన్, సి.పి.ఐ నుండి యం. శివ, బి.ఎస్పీ నుండి ఎ. నాగయ్య, బి.యం.పీ నుండి గడ్డం విజయ్ తదితరులు పాల్గొన్నారు.