కంటి వెలుగును ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య,ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,

పత్రిక ప్రకటన

తేదీ : 03–01–2023

కంటి వెలుగును ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి ,

రాష్ట్ర వైద్య, ఆరోగ్య,ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,

జనవరి 18 నుంచి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం ప్రారంభం,

కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ లు, అధికారులతో వీడియో సమావేశంలో దిశా నిర్దేశం చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు-

రాష్ట్ర  వ్యాప్తంగా ఈ నెల 18 నుండి నిర్వహించు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , సీఎస్ సోమేష్ కుమార్, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ప్రజల కంటి సమస్యలు తొలగించుటకు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు  కార్యక్రమం చేపట్టారని, దీనిలో భాగంగా  రెండవ విడత కార్యక్రమం ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నందున షెడ్యూల్ రూపొందించుకొని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాల్లో, వార్డులలో ప్రజలంతా కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కంటి వెలుగు శిబిరాల్లో సమాచారం నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ట్యాబ్లను  అందించడం జరుగుతుందని తెలిపారు.  రాష్ట్రంలో గతంలో  827 బృందాలు కంటి వెలుగులో పని  చేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1,500కు పెంచినట్లు, జిల్లాలో గల జనాభాకు అనుగుణంగా వంద పని దినాలలో నిర్దేశిత తేదీలలో నిర్వహించే విధంగా శిబిరాలు నిర్వహించాలి అన్నారు. ప్రతి కంటి వెలుగు బృందంలో ఒక మెడికల్ అధికారి, ఒక అప్తామాలజిస్టు,  ఇద్దరు ఏఎన్ఎమ్లు, ముగ్గురు ఆశా వర్కర్లు, ఒక  డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారని, వీరికి కారు, , అవసరమైన కంటి పరీక్షల యంత్రాలు సిద్దం చేశామని మంత్రి హరీశ్రావు వివరించారు. ఈ వైద్య బృందంలో రోజుకు 1500 రూపాయల చొప్పున భోజన వసతి సౌకర్యం కోసం అందించడం జరుగుతుందని, బృందం సభ్యులు స్థానికంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ లు చేయాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయడానికి ప్రతి రోజూ వెయ్యి రూపాయల చోప్పున పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ముందుగానే విడుదల చేయడం జరుగుతుందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి కలెక్టర్ లకు సూచించారు. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేస్తూ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలని,  మండల పరిషత్, మున్సిపల్ సమావేశాలు నిర్వహించి షెడ్యూల్ అందజేయాలని మంత్రి తెలిపారు. గ్రామాల్లో, మున్సిపాలిటీలో  పెద్ద ఎత్తున ప్రజలు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గోనేలా ముందస్తు సమాచారం అందించాలని, స్వశక్తి మహిళా సంఘాలు, మెప్మా బృందాల సహకారంతో ప్రజలను మొబిలైజ్ చేయాలని  సూచించారు.కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని, రీడింగ్ కళ్ళద్దాలను జిల్లాలకు పంపుతామని, వాటిని పీహెచ్సీల  ద్వారా బృందాలకు పంపిణీ చేయాలని మంత్రి హరీశ్రావు వివరించారు. సాధారణ వైద్యసేవలకు అంతరాయం కలుగకుండా 927 డాక్టర్లను నియమించడం జరిగిందని,  ప్రజలకు అందుబాటులో,  అనువైన స్థలాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే జిల్లాలో కంటి వెలుగుకు అవసరమగు ఆప్తమాలజిస్టులు,  డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కల్పించడం జరిగిందని, రీడింగ్ కళ్లద్దాలు పరీక్ష చేసిన అదే రోజు, డిస్టెన్స్ స్పెసిఫిక్ కళ్ళద్దాలు నెల రోజుల్లో ప్రజలకు అందజేయనున్నట్లు తెలిపారు. కంటి వెలుగు శిబిరాల నాణ్యత పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10 బృందాలను, ప్రతి జిల్లాలో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో విస్తృతమైన ప్రచారం కల్పించడంతో పాటు ఏ రోజు ఏ గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అనే విషయం ప్రజలకు ముందుగా తెలియజేయాలని మంత్రి సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని అన్నారు. గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు  కంటి వెలుగు దోహద పడుతుందని , దానిని  విజయవంతం చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్,  ఎంపీటీసీ, వార్డు సభ్యులు, అధికారులు, డీఆర్డీఏ విభాగం వారు కలిసి పని చేయాలని అన్నారు. కంటి వెలుగు క్యాంప్ జరిగే రోజు అందుబాటులో ఉంటూ కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని అన్నారు. కంటి వెలుగులో అందిస్తున్న అద్దాలు కూడా చాలా బాగున్నాయని,  అవసరం ఉన్న అందరికీ ఇవి అందేలా కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ కంటి వెలుగు పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో సిద్ధం చేసుకున్న షెడ్యూల్ కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. పంచాయతీ, మున్సిపాలిటీలో ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని, ప్రజలు అడిగే వివిధ సందేహాలు నివృత్తి కోసం ఎఫ్.ఎక్యు తయారు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ… కంటి వెలుగు అమలు చేసేందుకు మున్సిపల్ శాఖ ఉత్తర్వు సంఖ్య 779 జారీ చేసిందని, క్యాంపులో ఏర్పాటుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అనువైన ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలలో ఉన్న మెప్మా, మహిళా సంఘాలు, రిసోర్స్ పర్సన్స్ వినియోగిస్తూ క్యాంపులో నిర్వహణపై విస్తృత ప్రచారం కల్పించి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

––––––––––––––––––––––––––––––––––––––––––@@@@@@@@@@

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత కంటి వెలుగును విజయవంతం చేయాలి,

రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని ఈ విషయంలో అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం బీఆర్కే భవన్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన నిర్వహించిన  కంటి వెలుగు – -2 రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, ఎమ్ఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్,  హెల్త్ కమిషనర్ శ్వేతా మహంతి, మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు   మాట్లాడారు.  రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్ హరీశ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ… రెండో విడత కంటి వెలుగుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జనవరి 18వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి చరిత్ర సృష్టించారని అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 27,51,810 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 79 బృందాలను ఏర్పాటు చేయగా అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 51 బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 బృందాలు, మున్సిపల్ పరిధిలో 18 బృందాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ విషయంలో అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఇది ఎంతో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. అలాగే ప్రతి నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో 300 మందికి, అర్బన్, పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజూ 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి మల్లారెడ్డి వివరించారు.  అలాగే ఆయా మున్సిపాలిటీలలో వార్డుల వారీగా, మండలాలలో గ్రామ పంచాయతీల వారీగా ఏ రోజు వైద్య శిబిరం ఎక్కడ నిర్వహించేది వైద్య బృందాలకు ఎక్కడ వసతి ఏర్పాటు చేయాలనే విషయాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు, అభిషేక్ అగస్త్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆయా మున్సిపాలిటీల ఛైర్మన్లు, కమిషనర్లు, మేయర్లు, అధికారులు, సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Share This Post