You Are Here:Home→కంటి వెలుగు… సమస్యలు తొలుగు* ● నల్లగొండ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న *కంటి వెలుగు* ● 41 రోజుల్లో సుమారు 3,77,214 మందికి కంటి పరీక్షలు ●లక్ష్యంలో 52 శాతం మందికి పరీక్షలు పూర్తి ● కంటి వెలుగు కార్యక్రమంకు విశేష స్పందన
కంటి వెలుగు… సమస్యలు తొలుగు* ● నల్లగొండ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న *కంటి వెలుగు* ● 41 రోజుల్లో సుమారు 3,77,214 మందికి కంటి పరీక్షలు ●లక్ష్యంలో 52 శాతం మందికి పరీక్షలు పూర్తి ● కంటి వెలుగు కార్యక్రమంకు విశేష స్పందన
*ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేసినవి:* 39,442
*ఇప్పటివరకు వచ్చిన ప్రిస్క్రిప్షన్ కళ్ళజోళ్ళు :* 18,294
*అందులో పంపిణీ చేసినవి :* 16,377
*నల్లగొండ :* కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు నల్గొండ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు అంధత్వ రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప సంకల్పంతో జనవరి 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా సమస్యలు దూరమవుతున్నాయని ప్రజలు సంబరపడుతున్నారు.18 సం.లు పై బడిన వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో తీసుకున్న వారు మురిసిపోతున్నారు. కంటి చూపు సరిగ్గా కనిపించక ఇబ్బందులు పడుతున్న మాకు తమ దగ్గరికే వచ్చి కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి తమ జీవితాల్లో వెలుగు నింపుతున్న ముఖ్యమంత్రి సల్లగుండాలని తమ దీవెన లిస్తున్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈశిబిరాలకు వచ్చే ప్రజలు ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మంచి కార్యక్రమం అని తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈకార్యక్రమాన్ని జూన్ 15 వరకు కొనసాగించనున్నారు. సెలవు దినాల్లో మినహా సిబ్బంది స్థానికంగానే అందుబాటులో ఉంటూ పరీక్షలు త్వరగా పూర్తిచేసేలా చొరవ చూపుతున్నారు. ఇచ్చిన లక్ష్యాల పూర్తికి కసరత్తు చేస్తున్నారు.
*75 బృందాల ఏర్పాటు*
కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు 74 బృందాలతో పాటు ఒక బఫర్ బృందాన్ని ఏర్పాటు చేశారు. మండలాలలో, పురపాలికల్లో పనిచేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను యూనిట్ గా తీసుకొని గ్రామాలను ఎంపిక చేశారు. ఆశాలు, ఏఎంఎంలు, అధికారులు గ్రామాల్లో జనాభా వారీగా వివరాలు సేకరించి అందుకు అనుగుణంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పురపాలిక చైర్మన్, కమిషనర్లు, కౌన్సిలర్లు సహాయం తీసుకుంటూ ఆ ప్రాంతంలోని 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
*3.77 లక్షల మందికి పరీక్షలు.. 52 శాతం పూర్తి:*
నల్లగొండ జిల్లాలోని మొత్తం 844 గ్రామపంచాయతీలు, 8 పురపాలిక సంఘాల పరిధిలోని 182 వార్డుల్లో రెండో విడతలో భాగంగా సుమారు 7.90 లక్షల మందికి పరీక్షలు చేయాలనేది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అంచనా వేసి ఇప్పటివరకు 3,77,214 మందికి కంటి పరీక్షలు చేశారు. 56,817 మందికి ఉచితంగా రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. అలాగే ప్రిస్క్రిప్షన్ అద్దాలు 39,442 మందికి అవసరం కాగా తగిన విధంగా తయారు చేయించి ఇవ్వనున్నారు. ఇప్పటికే 16,377 ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలోని కొన్ని పంచాయతీలు, పురపాలికల్లోని వార్డులు ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో పలు శిబిరాలు శతశాతం చేసి ఆదర్శంగా నిలిచాయి. ప్రిస్క్రిప్షన్ రాసిన వాటికి సంబంధించి వారం పది రోజుల్లో కళ్ళజోళ్ళు రానున్నాయని తెలిపారు. ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి చుక్కల మందుతో పాటు ఏ,డి, బి కాంప్లెక్స్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
*మందగిస్తున్న చూపు..*
జిల్లాలో సుమారు 7.90 లక్షల మంది ఉండగా 3,77,214 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. చాలా మందిలో కంటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి. యువత ఎక్కువగా చరవాణి, కంప్యూటర్ వినియోగంతో కంటి చూపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 40ఏళ్లు దాటిన వారిలోనూ చూపు మందగిస్తుంది.
*అందరి సహకారంతో విజయవంతంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ*
— డా.కొండల్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి.
జిల్లాలో జనవరి 19న ప్రారంభించి జిల్లా మంత్రి వర్యులు జి.జగదీశ్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కంటి సమస్యలు నివారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలకు ఉపయోగపడేలా కంటి వెలుగు బృహత్తర కార్యక్రమం ప్రారంభించారని, గ్రామాల్లో ప్రజల చెంతకు కంటి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు, దృష్టి లోపాలు, కంటి సమస్యలు ఉన్న వారు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి.
*శిబిరాలు ఎంతో ఉపయోగకరం*
— వల్లందాసు దశరథ, ఆరెగూడెం, చిట్యాల మండలం
– కళ్ళు సరిగ్గా కనబడనందున చూయించుకునేందుకు కంటి వెలుగు వైద్య శిబిరానికి వచ్చాను. శిబిరాల్లో కంటి పరీక్షలను బాగానే చేస్తున్నారు. నేను కంటి పరీక్షలు చేయించుకున్నాను. గ్రామాల్లో కంటి సమస్యలతో ఎందరో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పేదలకు వరంగా మారింది. మాలాంటి మధ్య తరగతి ప్రజలకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. డాక్టర్లు కళ్లను పరీక్షించి ఉచితంగా అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు నా చూపు మెరుగుపడింది. అద్దాల నాణ్యత కూడా చాలా బాగుంది.
*పరీక్షలు బాగా చేస్తున్నారు.*
— ఆనగంటి బుచ్చమ్మ, పెద్దకాపర్తి, చిట్యాల మండలం
నా పేరు ఆనగంటి బుచ్చమ్మ. తరచూ తలనొప్పి వస్తుండటం వలన శిబిరానికి వెళ్లి చూయించుకున్నాను. డాక్టర్లు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. గతంలో ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వెచ్చించి పరీక్షలు చేయుంచుకున్నాను. అద్దాలు కొనాలంటే కూడా ఇబ్బందులు పడేవారం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కంటివెలుగు వల్ల నేరుగా గ్రామాలకే వచ్చి పరీక్ష చేసి ఉచితంగా అద్దాలు, మందులు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇప్పుడు సమస్య కొంతమేర తగ్గింది. మాలాంటి వారికి ఈసేవలు మేలు చేస్తున్నాయి. దూరప్రాంతాలకి వెళ్లి పరీక్షలు చేసుకునే బాధ తప్పింది.
*ఇబ్బందులు లేకుండా చర్యలు :*
— డా. ఉబ్బు నర్సింహా, పిహెచ్సీ వైద్యాధికారి
కార్యాచరణ ప్రకారంగా పిహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో నేత్ర పరీక్షలు చేస్తున్నాం. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజు లక్ష్యం కంటే ఎక్కువగానే పరీక్షలు నిర్వహిస్తున్నాము. అవసరమైనవారికి రీడింగ్ కళ్లద్దాలు వెంటనే ఇస్తున్నాం. ప్రిస్కీప్షన్ అద్దాలు కొన్ని రోజులు గడువుపెట్టి బాధితుల ఇంటికి చేరవేస్తున్నాం. కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేసుకోవాలని చెబుతున్నాం.
*కంటి వెలుగు… సమస్యలు తొలుగు*