*కాళేశ్వరం ప్రాజెక్టు పనుల నిమిత్తం జిల్లాలోని వివిధ చెక్ డ్యాంల ముంపు ప్రాంతాల నుండి ఇసుక రవాణా చేయడానికి అనుమతులు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 12: కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ అవసరాల నిమిత్తం జిల్లాలో ఇసుక లభ్యతకు చెక్ డ్యాంల ముంపు ప్రాంతాల వద్ద అనుగుణంగా ఉన్న ప్రదేశాల నుండి ఇసుకను రవాణా చేయడానికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సాండ్ (ఇసుక) కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి, జిల్లాలో ఇసుక లభ్యత, మొదలైన అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇల్లంతకుంట మండలం కస్బెకట్కూర్ చెక్ డ్యాం ముంపు ప్రాంతం, సిరిసిల్ల పట్టణం సాయినగర్ చెక్ డ్యాం ముంపు ప్రాంతం నుండి నీటి పారుదల శాఖ వారి సూచనతో ఇసుకను కాళేశ్వరం పనుల నిమిత్తం కోసం అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్యాకేజీ -17 కు సంబంధించిన ఇసుక అవసరాలు, ఇసుక లభ్యత ఆధారంగా కేటాయింపులు జరపడంపై చర్చించారు. ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామ శివారులో గల ఇసుక రీచ్ నీటితో నిండి ఉండడం వలన పూడిక తీత సాధ్యం కాదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ శివారులో మూలవాగు పరివాహక ప్రాంతంలో కొంత మేరకు పట్టా భూమిలో ఇసుక నుండి ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న భూ దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ఈ భూములను పరిశీలనకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, మైన్స్ ఏడీ సైదులు, జిల్లా భూగర్భ జల అధికారి నర్సింహులు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నారాయణ, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, ఆర్టీఓ కొండల్ రావు, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, ఇరిగేషన్ డీఈ సంతోష్, TSMDC ప్రాజెక్టు అధికారి జగన్ మోహన్ రెడ్డి, మైన్స్ ఆర్.ఐ. సైదులు తదితరులు పాల్గొన్నారు.