పలు దేశాల్లో కోవిడ్ వ్యాప్తి చెందుతున్నదని, గ్రామస్థాయి మల్టి డిసిప్లినరీ టీమ్ లతో ఇంటింటి సర్వే చేసి వందశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య అధికారులు, పంచాయితి అధికారులతో కోవిడ్ వ్యాక్సినేషన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో 1.82 లక్షల మందికి వ్యాక్సిన్ అందించాల్సి ఉందని, 24,836 మంది ఓవర్ డ్యూవ్ ఉందని తెలిపారు. రెండవ డోస్ తీసుకునే కేటగిరిలో ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, ప్రతి రోజు ఆయా మండలాల్లో వ్యాసకినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వ్యాక్సిన్ అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించిన మేరకు మండల గ్రామా పంచాయితీ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రత్యేక అధికారులుగా నియమించి, ప్రతి ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలు సేకరించి ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. వ్యాక్సినేషన్ తక్కువగా నమోదు అయిన ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో మోటివేషన్ క్యాంపులు నిర్వహించి వందశాతం వ్యాక్సిన్ అందించేందుకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. విజయసారధి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.