పత్రికా ప్రకటన. తేది:25.01.2023, వనపర్తి.
. ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, ఓటర్ గా పేరు నమోదు చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి అధికారులకు సూచించారు.
బుధవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో “13వ. జాతీయ ఓటర్ల దినోత్సవం- 2023” ను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ నమోదు ప్రక్రియ శర వేగంగా జరుగుతున్నదని, 18 సం.లు పూర్తైన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఓటుహక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, ఓటర్ కార్డుకు ఆధార్ నంబర్ అనుసంధానం చేయాలని ఆయన అన్నారు. భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే హక్కు ఓటర్ కు మాత్రమే ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల అధ్యక్ష పాలన గురించి, ఓటు ప్రాధాన్యత గురించి ఆయన వివరించారు. మనదేశంలో యువత ఎక్కువగా ఉన్నదని, దేశ భవిష్యత్తును నిర్ధారించే హక్కు ప్రతి ఒక్క ఓటర్ కు ఉన్నదని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. మన జిల్లాలో ఓటర్ జాబితా ప్రకారం 2 లక్షల 22 వేల 611 మంది పురుషులు, 2 లక్షల 20 వేల 183 మంది స్త్రీలు 7 మంది ట్రాన్స్ జెండర్ లు, మొత్తం 4 లక్షల 42 వేల 801 మంది ఓటర్లుగా నమోదు చేయటం జరిగిందని ఆమె వివరించారు.
జిల్లాలో ఇప్పటి వరకు ఫామ్ -6 (బి) పూర్తి చేసి, ఓటర్లుగా 82 శాతం పూర్తి చేయటం జరిగిందని ఆమె సూచించారు. రాష్ట్రంలో ఎక్కువ ఓటర్ నమోదు చేసిన జిల్లాగా వనపర్తి నియోజకవర్గం ఉన్నదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు కలిగి వుండాలని ఆమె అన్నారు. ఎవరికైనా ఒక్కటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు ఉన్నట్లైతే స్వతహాగా వారు తొలగించేలా అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. గరుడ ఆప్ ద్వారా ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఓటు ఒక ఆయుధం అని, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే హక్కును కలిగి ఉంటుందని ఆమె సూచించారు.
జిల్లా స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎన్.జి.ఓ.లు గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలని, విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. ఓటర్ నమోదుకు సంవత్సరంలో 4 సార్లు అవకాశం కల్పిస్తున్నట్లు, జనవరి 1వ. తేదీన, ఏప్రిల్ 1వ. తేదీన, జూలై 1వ. తేదీన, అక్టోబర్ 1వ. తేదీన అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. గతంలో జిల్లాలోని ఓటర్ నమోదు శాతం తక్కువగా ఉన్నదని, ప్రస్తుతం జాతీయ ఓటర్ నమోదు నిష్పత్తిని చేరుకుంటున్నామని ఆమె సూచించారు. ఎన్నికల సమయంలో 18 సం.లు దాటిన వారందరూ తప్పని సరిగా ఓటర్లుగా నమోదు అయి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె ఆదేశించారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, జిల్లా రెవెన్యూ అధికారిని పద్మావతి, జిల్లా అధికారులు, జెడ్.పి.టి.సి.లు, సిబ్బంది పాల్గొన్నారు.
___
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.




