జనవరి 18 నుండి చేపట్టనున్న రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీగా సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేష మందిరంలో మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిఓ లు, వైద్య ఆరోగ్య, పంచాయతి రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కంటివేలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్యం, కళ్ళజోళ్ళు అందించడం జరుగుతుందన్నారు. డీనికొరకు 100 పని దినాల్లో జిల్లా లోని 18 సంవత్సరాలు దాటిన వారందరికి వైద్యం అందించేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 24 టీమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో, వార్డుల్లో ఏ రోజు ఎక్కడ కంటివేలుగు కార్యక్రమం పెట్టాలి, అనేది ప్రణాళిక చేసి డిసెంబర్ 12 లోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అప్పగించాల్సిన బాధ్యత మండల అభివృద్ధి అధికారులదేనని ఆదేశించారు.
అనంతరం ప్రధానమంత్రి సురక్ష యోజన, పి.యం.జే.జే.వై పై మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న శ్యానిటేషన్, మల్టీ లెవల్ వర్కర్స్ లకు ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి సురక్ష యోజన భీమా చేయించాలని ఆదేశించారు. ప్రతి వర్కర్ కు సంవత్సరానికి కేవలం రూ. 12/- చెల్లిస్తే ఇన్సూరెన్స్ అవుతుందని ఈ ఇన్సూరెన్స్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ద్వారా నే చేయించాలని ఆదేశించారు. పి.యం.జే.జే.వై. ఇన్సూరెన్స్ కు సంవత్సరానికి రూ.440 చెల్లిస్తే ఇన్సూరెన్స్ నమోదు అయిపోతుందని, వర్కర్లకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయించాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యాపార సంస్థలకు, చిన్న షాపులకు సైతం డిజిటల్ లావాదేవీలు జరగాలని నిర్దేశించిందని అందువల్ల తమ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లో ఉన్న అన్ని వ్యాపార షాపులను గుర్తించి ఒక నివేదిక లీడ్ బ్యాంక్ మేనేజర్ కు అప్పగించాలని ఆదేశించారు.
పల్లెప్రగతి పై సమీక్షిస్తూ ప్రతి పంచాయతి సెక్రటరీ తమ మొబాయిల్ లో పల్లె ప్రకృతి వనాలు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉందని రేపు డౌన్లోడ్ చేసుకొని వాటిలో పల్లెప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, బృహత్ ప్రకృతి వనాలు ఫోతోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన క్రేడా ప్రాంగణాలకు ఎఫ్.టి.ఓ అప్లోడ్ పూర్తి చేసి పేమెంట్ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ. 250 కూలి పదేవిధంగా చూసుకోవాలన్నారు. నర్సరీల్లో ఇప్పటి వరకు పాత మొక్కలు 6 లక్షలు వరకు ఉన్నాయని, ఉన్న మొక్కలకు బ్యాగ్ మార్చడం, బెడ్ లు మార్చడం వంటివి చేసుకొని మొక్కలు గొప్పగా పెరిగే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. కొత్త నర్సరీ లకు డిమాండ్ పెట్టుకొని జిల్లాలో ఈ సారి 26 లక్షలు పెంచాల్సి ఉందని వాటికి బెడ్ ఏర్పాటు చేసుకోవడం బ్యాగ్ ఫిల్లింగ్ వంటివి చేసుకోవాలని ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో ఉపాధిహామీ కింద ప్రతి గ్రామ పంచాయతీలో ఓక యం.ఐ ట్యాన్క్, కనీసం 3 కిలోమీటర్ల ఫార్మేషన్ రోడ్ ( పొలాలకు వెళ్లే మట్టి రోడ్లు) పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామ పంచాయతీల్లో పంచాయతి సెక్రెటరీలు విధుల పట్ల నిర్లక్ష్యం చేయరాదని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవాలని మండల అభివృద్ధి అధికారులు, ఎం.పి.ఓ లను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, పి డి. డి.ఆర్.డి.ఏ గోపాల్ నాయక్, డి.పి.ఓ మురళి, జిల్లా వైద్య అధికారి డా. రాంమనోహర్, డి.యల్.పి.ఓ సుధాకర్ రెడ్డి, ఎంపీడిఓ లు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.