జమ్మికుంట పట్టణంలో పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళిని పరిశీలిచిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్.

హుజురాబాద్ ఉప ఎన్నిక శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహణ

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్

జిల్లా ఎన్నికల అధికారి తో కలిసి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి పరిశీలన
000000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి శనివారం హుజురాబాద్ పట్టణం లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళిని, జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో పాత్రికేయులతో మాట్లాడారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని 306 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ లు, హెల్త్ డేస్క్ లు ఏర్పాటు చేశారనీ తెలిపారు. మాస్కులు లేకుండా వచ్చే ఓటర్లకు హెల్త్ డెస్క్ లో మాస్కులు అందచేస్తున్నారని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45 శాతం ఓటింగ్ జరిగిందని, సాయంత్రం 7 గంటల వరకు ఇంకా ఎక్కువ మొత్తంలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఉప ఎన్నికలకు సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 కంపెనీల కేంద్ర పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వహిస్తున్నామని అన్నారు. వోటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటర్లoదరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ముందు రోజువరకు 3.50 కోట్ల నగదు సీజ్ చేశామని,1075 లీటర్ల మద్యం కూడా సీజ్ చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.

Share This Post