ఆహార కొరత, పౌష్టిక ఆహార లోపం వల్ల మరణాలు సంభావించకుండా అరికట్టెందుకు పౌర సరఫరాల ద్వారా పేద ప్రజలకు రేషన్ బియ్యం, పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాన్న భోజన సదుపాయం, అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోష్టిక ఆహారం, ఆసుపత్రులలో కెసిఆర్ కిట్ తో పాటు, నాలుగు విడతలుగా 13 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి తెలియజేసినారు.
ఈరోజు స్థానక డిపిఆర్ సి భావనంలో జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి ముఖ్య అతిధిగా జిల్లా స్థాయి జాతీయ ఆహార భద్రత చట్టంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ, దేశంలో 19 కోట్ల మంది ఆకలి, పౌష్టిక ఆహార లోపంతో అలమటిస్తున్నారని, ఇలాంటి వారికి మంచి పౌష్టిక ఆహారం కల్పించాలనే ఉద్యేశ్యంతో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పేద ప్రజలకు పౌర సరఫరాల ద్వారా రేషన్ బియ్యం, మధ్యాన్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలలో సేవలతో పాటు కెసిఆర్ కిట్, మీటర్నిటీ లాభాలు అమలుపార్చడం జరుగుతుందన్నారు.
ఇట్టి సదుపాయాలు సక్రమంగా అమలయ్యే విధంగా చూడటానికి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి నెల సమావేశాలు నిర్వహించి పర్యవేక్షించాలన్నారు. ఇట్టి కమిటీలలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సభ్యులుగా ఉండాలని, చట్టం సరిగా అమలు జరిగేలా చూడాలన్నారు.
జిల్లాలో కొత్తగా 7488 కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, ఇంకను పెండింగ్ దరఖాస్తులు ప్రభుత్వ అనామతుల ప్రకారం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన వారందరు ఆన్ -లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉండాలన్నారు. ప్రజలకు చెండాల్సిన సేవలను చట్టభద్దత కల్పించి రూపొందించిన చట్టం ఆహార భద్రత చట్టం అని అన్నారు.
ఈ సందర్బంగా ప్రజా ప్రతినిధులు లేవనేత్తిన సమస్యలకు స్పందిస్తూ పాఠశాలలకు నాణ్యత లేని బియ్యం సరఫరా చేసినట్లయితే, వాటిని వెంటనే మార్చుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాన్న భోజనం చేసి పెట్టడానికి గిట్టుబాటు ధర రానందున ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదని, దూర ప్రాంతంలో ఉండే వృద్దులు తమ రేషన్ బియ్యం తీసుకొని వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు తెలుపగా, ఇట్టి సమస్యలు స్థానికంగా పరిష్కరించుకొవాలని చైర్మన్ తెలియజేసినారు.
ఈ సందర్బంగా జిల్లాలోని 19 మండలాలలో 588 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 8,200 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్ తెలియజేసినారు. జిల్లాలో రేషన్ డీలర్లకు చెందిన 19 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రేషన్ కార్డులకు సంబంధించిన 160 ఫిర్యాదులు అందాయని వీటిని త్వరలో పరిష్కరిస్తామని అయన చైర్మన్ కు తెలియపరిచారు. జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకదేవి మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 1023 పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాన్న భోజనం విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు. పౌష్టిక విలువలతో కూడిన గుడ్లు, పప్పు, వెజిటబుల్ కర్రీ అందిస్తున్నామని తెలిపారు. అన్ని పాఠశాలలో మిషన్ భగీరథ త్రాగు నీరు అందిస్తున్నట్లు, అక్షయపాత్ర వారు కూడా కొన్ని పాఠశాలల్లో మధ్యాన్న భోజనం అందిస్తున్నారని ఈ సందర్బంగా ఆమె తెలిపారు. 1106 అంగన్వాడీ సెంటర్ లలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మంచి పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని, 870 మంది గర్భిణీలు, 53,224 మంది చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ది పొందుతున్నారని జిల్లా సంక్షేమ అధికారిని లలితకుమారి తెలియజేసినారు. మాతా శిశువు ఇద్దరు బాగుండాలనే ఉదేశ్యయంతో కెసిఆర్ కిట్, నాలుగు విడతలలో 13 వేల రూపాయలు బాలింతలకు అందజేయడం జరుగుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి తుకారం తెలియజేసినారు. వీరికి అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్బంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చైర్మన్ ను ఘానంగా సన్మానించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, DRDO కృష్ణన్, జడ్పీ వైస్ – చైర్మన్ విజయికుమార్ తో పాటు వికారాబాద్, తాండూర్ RDO లు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్, వికారాబాద్,తాండూరు,కొడంగల్ ,పరిగి, మున్సిపల్ కమీషనర్ లు ఎంపీడీఓ లు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, సర్పంచులు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.