జిల్లాలో కొత్తగా మంజూరు ఆయిన 22 షాపులతో కలుపుకొని మొత్తం 67 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ ఉప కమిషనర్ దత్తురాజ్ గౌడ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయంలో పత్రిక విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నోటిఫికేషన్ జారీ చేసిన 67 ఏ4 మద్యం షాపులకు అర్హత కలిగిన వారు ఈ నెల 18వ తేది లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యాలయ వేళల్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను జిల్లా ఎక్సైజ్ కార్యాలయం కలెక్టరేట్ భవనం రూమ్ నెం.114 లో గాని, నాంపల్లి, హైదరాబాద్ లోని కమిషనర్ కార్యాలయంలో అందజేయవచ్చన్నారు. వచ్చిన దరఖాస్తులను నవంబర్ 20వ తేదీన ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూల్ పట్టణంలోని సుఖాజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్లొ లాటరీ ద్వారా షాపులకేటాయింపు ఉంటుందని తెలియజేసారు. డిసెంబర్,1, 2021 నుండి నవంబర్ 30, 2023 వరకు కాల వ్యవధి ఉన్న ఈ మద్యం షాపులకు 50 లక్షల స్లాబు గలవి 16 కాగా 55 లక్షల స్లాబులవి 51 ఉన్నాయన్నారు. వీటిలో ఎస్సిలకు 9, ఎస్టీలకు 4, గౌడ కులస్తులకు 9 మిగిలిన 45 షాపులు జనరల్ కెటగిరికి కేటాయించినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకోడానికి 21 సంవత్సరాల వయస్సు నిండి ఎక్సైజ్ యాక్టు 1968 ప్రకారం కేసులు లేని వాళ్ళు అదేవిధంగా పై కేటగిరికి చెందిన స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. క్రితం సారి ఉన్న కొన్ని నిబంధనలు సడలించడం జరిగిందన్నారు. ఇంతకు ముందు నిర్దేశించిన స్థలంలోనే కాకుండా తమకు క్లస్టర్ లో అందుబాటులో ఉన్న స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు ఫీజ్ యధావిధిగా 2 లక్షలు నిర్దేశించడం జరిగిందన్నారు. బ్యాంక్ గ్యారంటీ, సంవత్సరిక వాయిదాల్లో సడలింపు ఒక వ్యక్తి ఒకే షాపుకు కాకుండా ఎన్ని షాపులకైనా ధరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 18 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.