ప్రచురణార్ధం
సెప్టెంబరు 02 ఖమ్మం –
జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారుల పనులకు సంబంధించి అనుబంధ శాఖల పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించి జాతీయ రహదారుల పనులు వేగవంతంగా జరిగేలా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జాతీయ రహదారులు, అటవీ, ల్యాండ్ సర్వే, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో జరుగుతున్న కోదాడ – ఖమ్మం, వరంగల్ – ఖమ్మం, ఖమ్మం – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారుల పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. జాతీయ రహదారులకు ఇప్పటికే చేపట్టిన భూసేకరణకు సంబంధించి ఇంకనూ పెండింగ్లో ఉన్న సమస్యలపై సత్వర పరిష్కార చర్యలు తీసుకొని పనులు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని సంబధిత శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారుల పనుల్లో భాగంగా మిషన్ భగీరథ పైప్ లైన్ల మార్పిడి, విద్యుత్ స్థంబాలు, ట్రాన్స్ఫార్మర్ ల మార్పిడి, వంతెనలకు సంబంధించి నీటి పారుదల శాఖ కెనాల్స్ ఇతర నీటి పథకాల పెండింగ్ పనులపై ఆయా శాఖాధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితో పాటు అటవీ శాఖకు సంబంధించిన పనులపై శాఖాపరమైన చర్యలను వెంటనే చేపట్టి రహదారుల పనులు కొనసాగేలా సత్వర చర్యలు తీసుకోవాలని అటవీ శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అనుబంధ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తమ శాఖలకు సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పద్మ, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, సర్వేల్యాండ్ ఏ.డి. రాము, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు. పుష్పలత, విద్యుత్ శాఖ డి ఇ రామారావు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు, కల్లూరు ఆర్.డి.ఓ. సూర్యనారాయణ, కూసుమంచి తహశీల్దారు శిరీష, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.