జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల పూర్తి వివరాలు సేకరించి ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్ ప్రొటెక్షన్, వన్ స్టాప్ సఖి సెంటర్ల పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గర్భిణీ మహిళలు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావంతో మరణిస్తున్న సంఘటనలు చూస్తున్నామని అలాంటి వాటిని అరికట్టేందుకు ముందుగానే రక్తహీనతతో బాధపడుతున్న మహిళల ఖచ్చితమైన వివరాలు సేకరించి తగిన వైద్యం అందించి పోషకాహారం ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని 1131 అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్ ఖచ్చితంగా నెలకొల్పేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యూట్రీ గార్డెన్ పెట్టేందుకు ఏ ఏ సెంటర్లలో మట్టి కానీ విత్తనాలు కానీ మరే సౌకర్యం కావాలో నివేదికను డి.ఆర్.డి.ఏ కు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 74 మంది అతి తక్కువ బరువు ఉన్న పిల్లలు, 44 మంది స్యామ్, 415 మంది మ్యామ్ పిల్లలను ఆర్.బి.ఎస్.కె ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి ఏ పిల్లోనికి ఏ రకమైన లోపంతో శారీరక ఎదుగుదల లేదో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అలాంటి పిల్లలకు ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసారు. అదేవిధంగా ఎక్కడైనా అంగన్వాడీ టీచర్, ఆయా ఇద్దరు లేని సెంటర్ల వివరాలు ఇవ్వాలని అలాంటి సెంటర్లలో స్వయం సహాయక సంఘాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఐ.టి.డి.ఏ అధికారిని ఆదేశించారు. చైల్డ్ హోమ్ లో ఉన్న పిల్లలకు కులధ్రువీకరణ, ఇంకమ్ సర్టిఫికెట్లు మంజూరు చేయించాలని సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. గ్రామస్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాకుండా తమ క్రిందిస్థాయి ఉద్యోగులను పంపిన చైల్డ్ లైన్ కమిటీ 1098 అధికారి, వన్ స్టాఫ్ సఖి సెంటర్ ఇంచార్జి లకు తమ ఉద్యోగం నుండి ఎందుకు తొలగించవద్దో షోకాజ్ నోటీస్ లు జారీ చేయాల్సింగా ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి ఇంచార్జ్ దమయంతి, పి.ఓ ఐ.టి.డి.ఏ అశోక్, బి.సి. సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఈ.డి ఎస్సి కార్పొరేషన్ రామ్ లాల్, ఏ.పి.డి రాజేశ్వరి, సి.డి.పి.ఓ లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.