తెలంగాణా కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన నిబద్దత గల వ్యక్తీ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్ లు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతిని పురస్కరించుకొని బి.సి. అభివుద్ది శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కల్లెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, పద్మశాలి సంఘ నాయకులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో, స్వాతంత్రోద్యమంలో , నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే గాక న్యాయవాదిగా ఎన్నో కేసులు వాదించి అందరిని బయటికి తీసుకువచ్చిన గొప్ప వ్యక్తని అన్నారు. అదేవిధంగా అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం ఎంతో కృషి చేసారని కొనియాడారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత వీరికే దక్కుతుందని వారన్నారు. సకల జనులు సంతోషంగా ఉండాలని జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను, దేశానికి ,రాష్ట్రానికి చేసిన సేవలను మననం చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.
పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ పేదల కోసం, తెలంగాణ కోసం పోరాడిన యోధుడు బాపూజీ అని అన్నారు. పద్మశాలీలు ఐకమత్యంగా ఉండాలని, ప్రభుత్వం కూడా పద్మశాలీలను గుర్తిస్తూ వారు ఆర్థికంగా ఎదగడానికి చేయూత నివ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్ , బి.సి. అభివృద్ధి అధికారి జగదీశ్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, డీఈఓ రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, ఎస్సి కార్పొరేషన్ ఈ.డి. దేవయ్య, యువజన క్రీడల అధికారి నాగరాజ్, ఏడుపాయల ఈ.ఓ. శ్రీనివాస్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల జయరాములు, ప్రధాన కార్యదర్శి గణపతి శివశంకర్, ఉపాధ్యక్షులు కంది ప్రభాకర్ కోశాధికారి విశ్వనాధం, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.