తెలంగాణ ప్రాశస్త్యం చాటిచెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 02 నుండి అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులతో చీఫ్ సెక్రెటరీ సమీక్ష జరిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లు, సన్నద్ధత గురించి జిల్లాల వారీగా పాలనాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తొమ్మిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి శాఖల వారీగా ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా తెలియజేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల ప్రజలు ఈవేడుకల్లో మమేకమయ్యేలా చూడాలన్నారు. ఉత్సవాల మొదటి రోజైన జూన్ 02న మొదటగా అమరవీరుల స్థూపాల వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించాలని, ఉదయం 9.00 గంటలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. మరుసటి రోజైన 03వ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా రైతు వేదికలను విద్యుద్దీపాలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించి ఎడ్ల బండ్ల ప్రదర్శనల ద్వారా పండగ వాతావరణంలో పెద్దఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. రైతులను సమీకరించి సాగు రంగానికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గురించి తెలియజేయాలని, రైతు బీమా లబ్ధిదారులతో వారి అనుభవాల గురించి మాట్లాడించాలని అన్నారు. ముందస్తుగా పంటలను వేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఆయిల్ పామ్ సాగుతో సమకూరే లాభాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇదే తరహాలో మిగతా కార్యక్రమాలను సైతం సమర్ధవంతంగా నిర్వహించాలని, ముఖ్యంగా విద్యుత్ దినోత్సవం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సురక్షా దినోత్సవం, సాగునీటి దినోత్సవం, ఊరూరా చెరువుల పండుగ, గిరిజనోత్సవం, తెలంగాణ రన్ తదితర కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని తెలిపారు. గిరిజనోత్సవం సందర్భంగా కొత్త జీ.పీలుగా ఏర్పాటైన తండాలను అందంగా ముస్తాబు చేసి, నిర్ణీత కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మంచినీళ్ల పండుగ సందర్భంగా ప్రజలతో ఫిల్టర్ బెడ్ల సందర్శన చేయాలని, హరితోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీ.ఎస్ సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని, అన్ని శాఖలు ఈ దిశగా సమిష్టి కృషి చేయాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ, శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, ప్రజాప్రతినిధుల సహకారంతో దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులతో సమావేశమై జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అధికారులందరు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితర అధికారులు పాల్గొన్నారు.