నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి
జిల్లాలోని మున్సిపాలిటీల కమిషనర్ల సమీక్షా సమావేశంలో…
జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
00000
నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్ నగరపాలక సంస్థ, చొప్పదండి, కొత్తపల్లి, హుజురాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తదితరులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠధామం, హరితహారం, కోవిడ్ వ్యాక్సినేషన్, శానిటేషన్ తదితర అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాలుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్, నాన్ వెజ్ మార్కెట్లను వెంటనే ప్రారంభించాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ప్రారంభించేందుకు స్థలాలు లేకుంటే వెంటనే స్థల సేకరణ చేసి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు వైకుంఠదామాల నిర్మాణాలు ప్రారంభించకుంటే ప్రారంభించాలని, అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. హరితహారంలో భాగంగా నర్సరీలు, అవెన్యూ ప్లాంటేషన్లు, మియావాకి పద్దతిలో ప్లాంటేషన్ నిర్వహించాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలు నాటించాలని సూచించారు. స్మార్ట్ సిటీ రోడ్లలో అందమైన పూల మొక్కలు నాటాలని, స్మృతి వనాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో మొదటి, రెండవ డోసు కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తిచేయాలని కమిషనర్లను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినీ కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు శానిటేషన్ పనులను, డ్రైడే లను, ఫాగింగ్ నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పబ్లిక్ టాయిలెట్లను ప్రజలు ఉపయోగించుకునేలా సక్రమంగా నిర్వహణ చేపట్టాలని సూచించారు. కరీంనగరం లో ఎనిమల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.