పత్రిక ప్రకటన. తేది:11-01-2022, వనపర్తి.
మార్చిలోగా ప్రగతిలో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్ లోని తన పెషీ చాంబర్ నుంచి, ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డిఆర్డిఓ, డిపిఓ, ఎంపిడీఓలు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ మార్చి లోగా పూర్తి చేయాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని, ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేసి, పనులను పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
కరోనా 3వ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి పారిశుద్ధ్యంపై రాజీ లేకుండా, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా, ఉధృతంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని, గత కరోనా సీజన్లలో పంచాయతీ సిబ్బంది, అధికారుల పనితీరు అద్భుతంగా ఉందని, ఫ్రంట్ లైన్ వారియర్ స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి సూచించారు. మొదటి విడత వ్యాక్సినేషన్లలో రాష్ట్రం వందకు వంద శాతం సక్సెస్ సాధించిందని, రెండో విడత కూడా పూర్తి చేయాలని ఆయన అన్నారు. బూస్టర్ డోస్ లను పర్యవేక్షిస్తూ, సిఎం కె.సి.ఆర్. సూచనలను పాటిస్తూ ఆరోగ్య తెలంగాణ సాధనలో మన శాఖ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు 100 శాతం వ్యాక్సిన్ వేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
పరిశుభ్రతను పాటించాలని, ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం చేయాలని, ట్రాక్టర్, ట్రాలీలతో చెత్త సేకరణ ప్రతి నిత్యం జరిగేలా చూడాలని, డంపింగ్ యార్డులలో తడి, పొడి చెత్తలను వేరు చేసి, ఎరువుల తయారీ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి రోజూ గ్రామ కార్యదర్శులు 7 గంటల కల్లా విధుల్లో ఉండాలని, వంద శాతం వైకుంఠ ధామాలు పూర్తి చేయడం అభినందనీయమని, వాటన్నింటినీ ఆచరణలోకి తేవాలని ఆయన అన్నారు. బహిరంగ మల విసర్జన రహిత (ODF) రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని ఆయన తెలిపారు.
పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాల స్థలాలు ఎక్కడైనా గుర్తించకపోయి ఉంటే, వెంటనే గుర్తించాలని, సిఎం కెసిఆర్ ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ప్రజలను ఆరోగ్యంగా ఉంచడానికి, వాకింగ్ ట్రాక్స్ గా ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేబర్ మొబిలైజేషన్, కొత్త కార్డుల జారీ అంశాలను జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో నగరాల ప్రజలు పల్లెబాట పడుతున్నారని, అలాంటి వాళ్ళందరికీ ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు.
పల్లె ప్రగతి కార్యక్రమం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా బంగారు తెలంగాణలో భాగంగా మనం, ఆరోగ్య, ఆదర్శవంతమైన పల్లెలను నిర్మించే పనిని మరింత శ్రద్ధతో నిర్వర్తించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.