పకడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి *ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం. అందుబాటులో ఉండాలి *పరీక్షల దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి *పోలీస్ బందోబస్తుతో ప్రశ్నపత్రాల తరలింపు విద్యార్థులు మానసిక ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాసే దిశగా చర్యలు పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ లోని వీడియో సమావేశం హాలు నుంచి *జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ వై.వి గణేష్ * లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించి నందుకు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరుగు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 90 వేల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని, దాదాపు 2 వేల 600 పైగా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. వేసవి కాలంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

విద్యార్థులకు హాల్ టికెట్ లను వెబ్ సైట్ bse.telangana.gov.in లో ఉంచామని, విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్ లో త్రాగునీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నారు.

10వ తరగతి పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకం, మోటివేషన్ అందించాలని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ, పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవా లని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

గతంలో ఉన్న 11 పరీక్షలను ప్రస్తుతం 6 పరీక్షలకు కుదించామని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు జరుగుతుందని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో 115 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 21 పరీక్షా కేంద్రాలలో 21 చీఫ్ సూపర్డెంట్లు 22 డిపార్ట్మెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారని,3170 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, మూడు సి సెంటర్లు ఉన్నాయని, అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు 31వ తేదీలోగా ఏర్పాట్లు చేస్తామని,
పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తామని కలెక్టర్ వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ
ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు 6 ప్రశ్నాపత్రాలే ఉంటాయని అన్ని పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటాయని, కానీ కాంపోజిట్ తెలుగు మరియు సైన్స్ పరీక్షలకు మాత్రం 12:50 వరకు సమయం ఉంటుందని వారు తెలిపారు.
పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సరిపడా ఫర్నిచర్ ముందే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లటి మంచినీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎవరు కూడా సెల్ ఫోన్లు మరియు ఎటువంటి ఎలక్ట్రిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకురాకూడదన్నారు.

పరీక్షా కేంద్రాలలో పరీక్షకు ముందు, తరువాత పారిశుద్య చర్యలను చేపట్టాలని, టాయిలెట్స్ సరిగా వుండేలా చర్యలు తీసుకోవాలని,
అలాగే నీటి పారుదల శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. పోలీసు శాఖ ప్రశ్నా పత్రాల స్టోరేజీ, తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. పరీక్ష అనంతరం పరీక్షా పత్రాల తరలింపు ప్రక్రియను పోస్టల్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. పరీక్షలు ప్రారంభమై ముగిసేంత వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వైర్లెస్ సెట్ తో ఒక అధికారి ఎళ్లవేళలా అందుబాటులో వుండాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన 2 రూట్లలో ప్రశ్నా పత్రాల పంపిణీ, జవాబు పత్రాలు భద్రపరచు సమయంలో రెవిన్యూ, పోలీసు అధికారుల పర్యవేక్షణ ఉండాలని, పరీక్ష నిర్వహించే రోజులలో పరీక్షా కేంద్రాల వద్ద జీరాక్సు సెంటర్లు మూసివుంచేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. వైద్య అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్స్, హెల్త్ కిట్స్ అందుబాటులో వుంచాలని తెలిపారు. ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా సమయానికి విద్యార్థినీ విద్యార్థులు సకాలంలో హజరయ్యేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా అధికారులు ముందస్తు కార్యాచరణతో రూట్ మ్యాపుల ఏర్పాటు ద్వారా సిద్దంగా వుండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా పరీక్షా కేంద్రాలలో పరీక్షలు పూర్తి అయ్యే వరకు విద్యుత్ సౌకర్యం ఉండేలా, పాఠశాల గదులలో ఫ్యాన్లు, లైటింగ్ వెలుతురు ఎక్కువగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణను చెక్ లిస్టు ప్రణాళికతో దిగ్విజయంగా నిర్వహించాలని అన్నారు.

ఈ వీడియో సమావేశంలో డిఈఓ పానిని, ఆడిషనల్ ఎస్పీ ఏ ఆర్ సదానందం, కె. అశోక్ పోస్టల్ డిపార్ట్మెంట్, డి ఈ విద్యుత్ శాఖ నాగేశ్వర రావు, ఆర్టీసి డిపార్ట్మెంట్ జ్యోష్ణ, డిఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, డి పి ఆర్ ఓ రఫీక్, ఏ సి జి ఈ జయదేవ్సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post