మూడవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మునిసిపల్ చైర్మన్ వార్డు అయిన పిల్లికోట్టాల్ లో బుధవారం నాడు జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్, మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్ లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచి వాతావరణ కాలుష్య్యాని నియంత్రించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం 7 విడతలుగా హరిత హారం కార్యక్రమం చేపట్టిందని, ప్రతి ఒక్కరు మొక్కలు పెంచి, సంరక్షణ భాద్యతలు చేపట్టాలన్నారు. మొక్కలు కూడా మరీ రోడ్డు పక్కకు కాకుండా భవిష్యత్తులో రోడ్డు వెడల్ప్లును దృష్టిలో ఉంచుకొని నాటాలని అధికారులకు సూచించారు.
మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రగతి లో భాగంగా అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రధానంగా పట్టణాన్ని పరిశుభ్రం చేయడంతో పాటు సేకరించిన చెత్తను తొలగించి డంప్ యార్డులకు తరలించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గించి రాబోయే తరానికి స్వచ్చమైన వాతావరణం పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఇంటా ఆరు మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఇంటింటింటికి మొక్కలు అందజేస్తున్నామని, మొక్కలు నాటడం పాటు వాటిని పరిరక్షించాలని అన్నారు. 7 విడతలుగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావడం వల్ల చెట్ల శాతం పెరిగి వాతావరణ కాలుష్యం కూడా తగ్గిందని అన్నారు.
అనంతరం రషీద్ కాలనీలో 5 లక్షల ఖర్చుతో సి.సి. రోడ్డు నిర్మాణానికి శంకు స్థాపన చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం కింద్ర ప్రతి గ్రామంలో డంప్ యార్డులు, స్మశాన వాటికలు నిర్మించుకున్నామని, చెట్లు పెట్టుకొని మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఈ వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా వార్డులు శుబ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలువ ఉండకుండా చూడాలని, ఇంటికి ఇస్తున్న ఆరు మొక్కలు నాటి సంరక్షణ భాద్యతలు చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ శ్రీహరి, జిల్లా పరిషద్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి తదితరులు పాల్గోన్న్నారు.