పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి-రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పత్రికా ప్రకటన. తేది:27.01.2023, వనపర్తి.

– పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి
– జిల్లాలో వెంటనే టీచర్ల సీనియార్టి జాబితా, ఖాళీల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలి
– ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి
– మన ఊరు – మన బడి, మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలి
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– – –

రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టాలని, అవినీతికి తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, రాష్ట్ర విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు – మన బడి, మోడల్ పాఠశాలల నిర్మాణం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో విద్యాశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టామని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు సీనియార్టి జాబితా, ఖాళీల జాబితా ఆన్ లైన్ లో ప్రదర్శించాలని, వాటిలో అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయుల కోసం తాత్కాలికంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మన ఊరు – మన బడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించారని ఆమె తెలిపారు. మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలలు ప్రారంభానికి సన్నద్దం చేయాలని, రెండు రోజుల్లో జిల్లాలకు ఫర్నీచర్ వస్తాయని, సదరు ఫర్నీచర్ ను ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న పాఠశాలలకు తరలించాలని ఆమె సూచించారు. మన ఊరు – మన బడి క్రింద అన్ని రకాల పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభోత్సవం నిర్వహించాలని ఆమె తెలిపారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలో మన ఊరు – మన బడి, మోడల్ పాఠశాలల కింద 28 పాఠశాలల పనులు పూర్తి చేసామని, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. పాఠశాలల్లో ఎన్.ఆర్.ఈ.జి. ఎస్. కింద చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. జిల్లాలో (26) పాఠశాలలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. జిల్లాలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల కోసం సీనియార్టి జాబితా, ఖాళీల జాబితాను జిల్లా వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగిందని ఆమె తెలిపారు.
అనంతరం జిల్లా అధికారులతో ఆమె సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మన ఊరు మనబడి పాఠశాలకు సంబంధించిన పనుల్లో భాగంగా ఎఫ్ టి ఓ ఎస్ లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు. పాఠశాలల ఆవరణలో చెట్లు పెంచాలని ఆమె ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఆశిష్ సంగ్వాన, డీఈవో రవీందర్, పంచాయతీరాజ్ ఈ ఈ మల్లయ్య, ఇంజనీర్లు, మండల విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———-
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

 

Share This Post