జిల్లాలోని 7 మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మున్సిపల్ కమీషనర్లు, డి.ఈ.లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఎక్కడా చెత్త ఉండకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, ప్రతి రోజు నివాసాలు, దుకాణాల నుండి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి చెత్తను తరలించే వాహనాల ద్వారా డంపింగ్యార్జుకు తరలించాలని, వార్డులు పరిశుభ్రంగా ఉండేలా ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని తెలిపారు. స్వచ్చ వాహనాల (డైవర్లకు చెత్త సేకరణలో అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారికి డైవింగ్ శిక్షణ, లైసెన్స్ ఇప్పించాలని అన్నారు. మున్సిపల్ కమీషనర్లు క్షేతస్థాయిలో పర్యటించి ప్రతి రోజు వారి పరిధిలోని సమస్యలను పరిష్కరించడం, చెత్త ఎక్కడా కనబడకుండా పారిశుద్ధ్య నిర్వహణపై పర్యవేక్షించడంతో పాటు సంబంధిత ఫొటోలను పంపించాలని తెలిపారు. స్వచ్చ వాహనాలను తప్పనిసరిగా వినియోగించడంతో పాటు వాటిని నిలుపు స్థలంలో నీడ కోసం షెడ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 29 వేల నివాసాలు ఉండగా తడి, పొడి చెత్తను సేకరించేందుకు గాను రెండవ విడత తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచడం కోసం చెత్తబుట్టలను పంపిణీ చేయాలని అన్నారు. మున్సిపల్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం అందించే మౌళిక సదుపాయాల కల్పన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్లు, డి.ఈ.లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.