పత్రికా ప్రకటన తేది:11.11.2021. వనపర్తి.
పోడు భూముల సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
గురువారం రాజాస్వ మండలాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పోడు భూముల సమస్యల పరిష్కార ధరఖాస్తుల స్వీకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూముల సమస్యను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగా ఈ నెల 8వ తేది నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టి డిసెంబర్ 8వ. తేది వరకు కొనసాగుతుందని, గ్రామాలలో టాం టాం లు వేయించాలని ఆమె సూచించారు. అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టా, అటవీ భూములను రక్షించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యమని, దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఎలాంటి అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పోడు భూముల కమిటీలలో జిల్లా కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారి, జిల్లా ట్రైబల్ అధికారి సభ్యులుగా ఉంటారని, గ్రామస్థాయిలో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, వి.ఆర్.ఏ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక కమిటీగా ఏర్పాటు చేసి, కమిటీలో సభ్యులుగా ఉంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలతో అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. గ్రామ స్థాయి కమిటీ పాత్ర కీలకమని, దరఖాస్తులు, తీర్మానాలు చేసి, ప్రతి ఒక్కరి దరఖాస్తులు స్వీకరించాలని ఆమె అన్నారు. సమావేశం ఏర్పాటుచేసి దరఖాస్తుదారులకు అవగాహన కల్పించి, అనంతరం గ్రామసభ నిర్వహించి, దరఖాస్తులు తీసుకుని క్షేత్ర పరిశీలన చేయాలని ఆమె సూచించారు. ఆయా స్థాయి కమిటీలలో తీర్మానాలు, తిరస్కారాలు రిజిస్టర్లు పక్కాగా నమోదు చేయాలని ఆమె సూచించారు. మండల స్థాయి కమిటీలు, ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉంటే, ప్రతి గ్రామంలో హ్యాబిటేషన్లలోను సమావేశాలు నిర్వహించాలని, 3,4 రోజులలో హబిటేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఆమె సూచించారు.
జిల్లాలో 970 మంది పోడు వ్యవసాయం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 36 గ్రామ పంచాయతీలలో పోడు భూముల ఆక్రమణలో ఉన్నాయని, డిసెంబరు 13, 2005 కన్నా ముందు సాగులో ఉన్న వారు హక్కుపత్రాలు పొందడానికి అర్హులని ఆమె వివరించారు.
పోడు భూముల వివరాలను నమోదు చేయుటకు A1- క్లైమ్ లు, A2- డిస్పాచ్, A3 – మినిట్స్ కు సంబంధించిన రిజిస్టర్ లను గ్రామస్థాయి కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. వాటి వివరాలను ఎలాంటి జాప్యం లేకుండా నమోదు చేయాలని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, జిల్లా అటవీ శాఖ అధికారి రామకృష్ణ, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, సర్పంచులు, అటవీశాఖ బీట్ ఆఫీసర్లు, అటవీశాఖ సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.