ప్రచురణార్థం…..1
తేదీ.30.1.2023
పోడు భూముల పట్టాల పంపిణీకి సన్నద్దం చేయాలి – రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
జయశంకర్ భూపాలపల్లి, జనవరి -30:
పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ ఫిబ్రవరి నెలలో జరిగేలా అధికారులు సన్నద్దం చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో కంటి వెలుగు, మన ఊరు మన బడి, పోడు భూములు, పామ్ ఆయిల్, టీచర్ ల బదిలీలు, జి.ఓ. 58, 59 లపై నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశం నుండి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, పోడు భూముల సమస్యకు సంబంధించి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వంద శాతం సర్వే, గ్రామ సభలు పూర్తి చేసామని అన్నారు. ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని, దీని అవసరమైన చర్యలు అధికారులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
అడవులను సంరక్షిస్తూనే అలాగే చట్టంకు లోబడి సాగు చేస్తూన్న గిరిజన, గిరిజనేతర రైతులకు పోడు భూముల పట్టాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాల వారీగా మరొకమారు సమీక్షించుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తెలిపారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, పెద్ద ఎత్తున చర్చ జరిగి సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను కొలిక్కి తీసుకొని రావడం జరిగిందని అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీ అనంతరం మరో ఇంచ్ భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు ఆయన సూచించారు. గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అన్ని పక్షాల ప్రతినిథులతో తదుపరి గ్రామాలో అటవీ సంరక్షణకు కట్టుబడి ఉండేలా, తదుపరి ఆక్రమణ కాకుండా తీర్మానం చేయాలని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ అర్హులందరికీ పోడు పట్టాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సూచించారు. జిల్లా కలెక్టర్ లకు సంబంధించిన డి.ఎల్.సి మాడ్యుల్స్ ఈ రోజు నుండి అందుబాటు లోకి వస్తాయని, రెండు రోజుల్లో ఎస్.డిఎల్.సి నుంచి వచ్చిన దరఖాస్తుల పై తుది నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ లను సి.ఎస్ ఆదేశించారు.
గ్రామ సభల తీర్మానాలు, ఎస్.డి.ఎల్.సి మధ్య ఉన్న గ్యాప్ పై జిల్లాలో కలెక్టర్ లు సమీక్షించాలని, గిరిజనులకు సంబంధించి చట్టం ప్రకారం రెండు ఆధారాలు ఉంటే తప్పనిసరిగా ఆమోదించాలని సీఎస్ పేర్కొన్నారు. పోడు భూముల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తు తిరస్కరించే పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సీఎస్ అన్నారు. జిల్లాలో కలెక్టర్ లు ముందస్తుగా ఎస్.డి.ఎల్.సి పూర్తి చేసిన దరఖాస్తులను ఆమోదించి ఫిబ్రవరి 6 నాటికి పోడు భూముల పట్టాలు ప్రింటింగ్ పూర్తి చేసి ముఖ్యమంత్రి నిర్ణయించే తేది నుండి పంపిణీ కోసం సన్నద్ధంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు.
ప్రజల దశాబ్దాల కలను ప్రభుత్వం సాకారం చేస్తూ పట్టాలు పంపిణీ చేస్తుందని, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరాలని, ఎస్.డి.ఎల్.సి హోల్డ్ లో పెట్టిన దరఖాస్తులు, తిరస్కరించిన దరఖాస్తులను కలెక్టర్ లు మరోమారు పరిశీలించి మార్గదర్శకాల ప్రకారం రెండు ఆధారాలు ఉంటే ఆమోదించాలని సీఎస్ ఆదేశించారు.
అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటి వెలుగు, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మన బడి, ఆయిల్ పామ్ సాగు అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ చర్చించారు.
కంటి వెలుగు శిబిరాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,81,774 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2.94 లక్షల మంది రీడింగ్ కళ్ళద్దాలు పంపిణీ చేశామని, 2.05 లక్షల మంది ప్రజలకు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల ఆర్డర్ చేశామని అన్నారు. జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించాలని, వారి ఫీడ్ బ్యాక్ తీసుకుని కలెక్టర్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
రాష్ట్రంలో చేపట్టిన టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగే విధంగా కలెక్టర్ లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదు స్వీకరణకు గ్రీవెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో ఉపాధ్యాయులు కోసం ప్రత్యేకంగా మెడికల్ బోర్డు, సదరం క్యాంపు ఏర్పాటు చేయాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన బడి కింద పూర్తి చేసిన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణం లో ప్రారంభించాలని, విద్యార్థులు, తల్లితండ్రులను భాగస్వామ్యం చేయాలని, ప్రజాప్రతినిధులు పాల్గోనేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 57 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు పెంచడం జరిగిందని, మార్చి చివరి నాటికి మరో 60 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ కు సంబంధించి 5 వేల ఎకరాల, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి 18 వేల ఎకరాల బిల్లులు వెంటనే సమర్పించాలని , 24 గంటలో చెల్లింపులు పూర్తి చేస్తామని అన్నారు.
జిల్లాలలోని 20 వేల ఎకరాల భూమి లో డ్రిప్ ఇరిగేషన్ పరిపాలన అనుమతులు జారీ చేసామని, సదరు భూములలో త్వరగా డ్రిప్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 17 సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడం జరిగిందని, జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం తప్పనిసరిగా ఐడిఓసి నుంచి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో టీచర్ల బదిలీలు పదోన్నతులకు సంబంధించి సినియార్టి జాబితా, ఖాళీల జాబితా ఆన్ లైన్ లో నమోదు చేసామని, మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి 17 కేసులు పరిశీలించామని తెలిపారు.
ఈ వీడియో సమావేశంలో కలెక్టర్ స్థానిక సంస్థలు టి.ఎస్.దివాకర, జిల్లా జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.శ్రీరామ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సంజీవరావు, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.