ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన సంకల్పమని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పి. రాములు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అగుచున్న సందర్బంగా ఆజాదిక అమృత్ మహోత్సవం లో భాగంగా గురువారం అచ్ఛంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ మేళా కార్యక్రమానికి ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యులు గువ్వల బాలరాజ్, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతి సబ్ డివిజన్ లో మెగా హెల్త్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంటి, పంటి, ఆర్థో వంటి అన్ని రకాల వైద్య నిపుణులు ఈ హెల్త్ మేళలో పాల్గొంటున్నారని ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఉచిత వైద్యం, మందులు పొందాలని సూచించారు. కనిపించని దేవుని కంటే వైద్యం చేసే డాక్టరును ప్రజలు దేవునిగా కొలుస్తారని అందువల్ల అచ్ఛంపేట వంటి ఏజెన్సీ ఏరియా పి.హెచ్.సీల్లో పనిచేస్తున్న డాక్టర్లు తమ వృత్తి ధర్మాన్ని పాటించాలని కోరారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడారని కొనియాడారు. అచ్చంపేటలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభమైతే ఇక్కడి ప్రజలకు అన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆయుష్ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ స్థానిక శాసన సభ్యులు గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ ఈ మధ్య ప్రజలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు దూసుకువెళుతున్నారని అందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని రంగాల్లో ఆదుకోవడమేనని అన్నారు. అచ్చంపేటలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అందరికంటె ముందుగా పూర్తి చేసుకున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గానికి వస్తే ఆసుపత్రిలో పాటు చెన్నకేశవ, ఉమామహేశ్వరం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాలను సైతం సి.యం. చేతుల మీదుగా శంఖుస్థాపనలు చేసుకోవాలని చూస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ రైతుల పొలాల్లో సాగునీరు పారాలని, రైతులు సంతోషంగా ఉండాలని కృషి చేస్తున్నట్లు తెలియజేసారు. అచ్ఛంపేట లో త్వరలోనే డయాలసిస్ సెంటర్, ట్యూబేక్టమీ ఆపరేషన్లు, సదరం క్యాంపు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందించడం జరిగిందని, ఇప్పుడు కాస్త కరోనా తగ్గుముఖం పట్టడంతో వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే అన్ని రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో అన్ని సబ్ డివిజన్లలో మెగా హెల్త్ మేళాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిపుణులైన వైద్యులు ఈరోజు ఇక్కడ అందుబాటులో ఉన్నందున ప్రజలు ఈ మెగా హెల్త్ మెలాను సద్వినియోగం చేసుకోవాలని ఉచితంగా వైద్యం, మందులు పొందాలని కోరారు.
అంతకు ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సుధాకర్ లాల్ ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే తమ జీవన శైలి ని మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. తెల్లగా కనిపించే ఉప్పు, చక్కెర, అన్నం వాడకాన్ని తగ్గించుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందినవారావుతారని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ పాండు నాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహ్మ గౌడ్, వైస్ చైర్మన్ శైలజ, ఎంపిపి శాంతాలోక్య నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సి. మధుసూదన్ రెడ్డి, జడ్పిటిసి మంత్ర్యానాయక్, పదర జడ్పిటిసి రాంబాబు, ఉప్పునుంతల జడ్పిటిసి ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోపాల్ నాయక్, డాక్టర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.