జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో76 వినతులు స్వీకరించిన అధికారులు,
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజలు తీసుకువచ్చిన ఆర్జీలు, వినతులు, విజ్ఞప్తులను సంబంధింత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం శామీర్పేట్ కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులు, వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు తీరుతాయని ఎంతో నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి వస్తారని దీనిని దృష్టిలో పెట్టుకొని సంబంధిత శాఖల జిల్లా అధికారులు వీలైనంత వరకు ఎప్పటి సమస్యలకు సంబంధించి పరిష్కారాలు అప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన 76 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల వారికి వాటిని అందచేసి వెంటనే పరిష్కరించాలని ప్రజల ఇబ్బందులు తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.