జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాలు,
ప్రజాస్వామ్య దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఈ విషయంలో ప్రతి యువతీ, యువకులు తప్పకుండా తమకు సంబంధించి ఓటు హక్కును నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో ఓటును తప్పకుండా వినియోగించుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అన్నారు.
బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, అధికారులు, సిబ్బందితో కలిసి ఓటరు ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు 25 జనవరి 2011 నుంచి జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని ఓటు హక్కు వజ్రాయుధమని తెలిపారు. ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటింగ్ సమయంలో తప్పకుండా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు యువతీ, యువకులు 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలని వారు తప్పకుండా ఓటు వేసేందుకు నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, సీపీవో రాంమోహన్, లా ఆఫీసర్ చంద్రావతి, ఆర్అండ్ బి శ్రీనివాస్ మూర్తి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.