ప్రచురణార్థం…..1
తేదీ: 25-1-2022

జగిత్యాల, జనవరి-25:- ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర అని, దేశాభివృద్దికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని అదనపు కలెక్టర్ బి.ఎస్.లత అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన 12 వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిధిగా హాజరైనారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని 18 సంవత్సరాలు యువత ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకోవాలని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని లేనిచో వెంటనే ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు. కొందరు ఎన్నికల ఓటింగ్ రోజునే తమ పేరు లేదని ఆందోళనకు దిగుతారని, ఇది మంచి పద్దతి కాదని ముందుగానే ఆన్లైన్, ఓటర్ యాప్ మొదలగు మాధ్యమాల ద్వారా సరిచూసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయుటకు నిర్ణయించిందని, దీని ద్వారా డూప్లికేట్ ఓటర్లకు అవకాశం ఉండదని తెలిపారు.
ఎన్నికల సంఘం ఈ.వి.యం. లలో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు నోటా కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఓటర్లు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చనిచో నోటాలో ఓటు వేసేలా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఓటర్లందరూ విధిగా ఆలోచించి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ది దిశలో నడిపే నాయకులనే ఎన్నికలలో గెలిపించుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదు, ఓటర్లను చైతన్యవంతులను చేయుటలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.
ఈ సందర్భంగా అందరిచే ఓటరు ప్రతిజ్ఞ చేపించారు. “భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము”
ఈ సందర్భంగా 01-01-2022 వరకు 18 సంవత్సరములు నిండిన నూతన ఓటరుగా నమోదు చేయించుకున్న యువతకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను,ఓటర్ కిట్లను అందజేశారు.
ఈ సమావేశంలో నూతన ఓటర్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి , జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం జగిత్యాల వారిచే జారీ చేయనైనది.