ప్రజా ప్రతినిధులు ,అధికారుల సమన్వయంతో జూన్ 2 నుండి 22 వరకు వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మహబూబ్ నగర్ ,నారాయణ పేట జిల్లాలలో విజయవంతం చేద్దాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2 తో 10 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా నాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటం చేసిన నేటి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు .అమరుల ఆశయాల కనుగునంగా తెలంగాణను తీసుకురావడం జరిగిందని, ఈ 9 సంవత్సరాల లో తెలంగాణ వివిధ అంశాలలో దేశానికే ఆదర్శంగా నిలబడి జాతీయస్థాయిలో సింహభాగాన్ని ఆక్రమించింది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు. గ్రామీణ ప్రజలతో పాటు, పట్టణాల్లోని వారు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విషయమై మహబూబ్ నగర్ ,నారాయణపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం మహబూబ్ నగర్లోని సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
గతంలో పాలమూరు కూలీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి అని,అలాంటిది ఈరోజు అన్ని రాష్ట్రాల నుండి మహబూబ్ నగర్ కు వలస వస్తున్నారని, 9 ఏళ్లలో అన్ని రంగాలలో జిల్లా ఎంతో ప్రగతిని సాధించడం జరిగిందని, ఉపాధితో పాటు, ఉద్యోగం ,వ్యవసాయం, వైద్యం కలెక్టరేట్ల నిర్మాణం ఎన్నో చేపట్టడం జరిగిందని, గతంలో కలెక్టర్లు ,పరిపాలన అంటే తెలిసేది కాదని, ఇప్పుడు కేవలం అర్ధగంటలో జిల్లా కలెక్టర్లను కలిసె అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, పారిశ్రామిక రంగం, వ్యవసాయం ఇలా ఒకటేమిటి అన్నిరంగాలు అభివృద్ధిలో ముందున్నాయని, 2014 కు పూర్వం తెలంగాణ, 2014 తర్వాత తెలంగాణను కళ్లకు కట్టినట్టుగా ప్రజలందరికీ తెలియజేపే బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులందరిపై ఉందని ఆయన అన్నారు.
ఉత్సవాలలో భాగంగా రోజువారి నిర్వహించే కార్యక్రమాలపై మంత్రి పలు సూచనలు చేస్తూ ఉత్సవాలను అధికారులు తమదిగా తీసుకొని నిర్వహించాలని, అందరూ హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని, బాగా పనిచేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు సన్మానిస్తామని, అన్ని కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, సంబంధిత శాసన సభ్యులు ఇతర ప్రజాప్రతినిధుల సమ్మతితో కార్యక్రమాలను నిర్వహించాలని, అన్ని శాఖలు గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో తయారు చేయాలని, ఈ సమాచారం మొత్తం జూన్ రెండు లోపు ప్రజాప్రతినిధులందరికీ సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ రైతు దినోత్సవం మొదలుకొని జూన్ 22 న నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కవులను, కళాకారులను సత్కరించాలని, తెలంగాణ గిరిజన ఉత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులను పిలిచి సేవాలాల్ మహారాజ్, దేవాలయం మండపం గురించి తెలియజేయాలని, తెలంగాణ మంచినీళ్ల పండుగ సందర్భంగా అన్ని వాటర్ ట్యాంకుల వద్ద గతంలో నీటి కోసం మహిళలు పడిన ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితి పై నాడు- నేడు ఫోటోలతో సహా తెలియజేసే ప్రయత్నం చేయాలని, ప్రతి శాఖ ఉత్సవాలను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఉత్సవాల నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు. ప్రతి శాఖ ద్వారా నాడు -నేడు పరిస్థితిని ఫోటోల ద్వారా వివరించాలన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో విజయవంతం చేయాల్సిందిగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన సూచనలు, ఆదేశాలను వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులందరు భాగస్వాములు కావాలని, జూన్ రెండవ తేదీన ఉదయం 9 గంటలకు సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారని, అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారని తెలిపారు. అదే విధంగా ఆయా తేదీలలో నిర్వహించనున్న కార్యక్రమాల సందర్భంగా అవసరమైన ఏర్పాటు చేయాలని ,అన్ని రోజులలో ఆయా రోజుల వారి నిర్వహించే కార్యక్రమాలపై అధికారులకు ఇదివరకే ఆదేశించడం జరిగిందని, అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు అందరు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాధించిన విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చెప్పాల్సి ఉందని,తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఇందుకుగాను అధికారులందరూ పూర్తిగా సహకరించాలని, తెలంగాణలో 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఆధారం చేసుకుని అభివృద్ధిలో ఒకరికొకరు పోటీ పడాలని పిలుపునిచ్చారు.
నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు చేసిన పనిని గొప్పగా చెప్పుకునేందుకు ఇది చక్కటి అవకాశం గా మార్చుకోవాలని, అలాగే ఈ ఉత్సవాలు ప్రజాప్రతినిధులకు కూడా మంచి అవకాశం అని అన్నారు.
కొడంగల్ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 9 ఏండ్ల అభివృద్ధిని తెలియజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో అన్ని గ్రామాలు, పట్టణాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇద్దరు కలిసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను సైతం భాగస్వామ్యం చేయాలని ,వీలైనంత ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయితే కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు.
ఈ సమావేశంలో నారాయణ పేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వనజ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యా నాయక్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డీసీసీబీ ఇంఛార్జి ఛైర్మన్ కే. వెంకటయ్య,
ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్ పర్సన్లు కే.సీ నర్సింహులు, బస్వరాజు, లక్ష్మి, , ఎస్పీ కె నరసింహ, అడిషనల్ కలెక్టర్లు సీతారామారావు, మయాంక్ మిట్టల్, అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.