ప్రచురణార్థం—-2
తేదీ.25.4.2022

మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ పై శ్రద్ధ
పెండింగ్ దళిత బంధు యూనిట్లు త్వరితగతిన గ్రౌండ్ చేయాలి
100% ఉత్తీర్ణత సాధన దిశగా కృషి
100% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలి
గ్రామ పంచాయతీల్లో సకాలంలో లేఔట్లకు అనుమతి
అనధికార గోడ రాతలు,వాల్ పోస్టర్లను వెంటనే తొలగించాలి
మన ఊరు మన బడి కార్యక్రమం అమలు , దళిత బంధు మొదలైన పలు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ పై అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల ఏప్రిల్ 25:- జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు.
మన ఊరు మన బడి, దళిత బంధు పథకం, మొక్కల సంరక్షణ, 10వ తరగతి పరీక్షలు,పన్నుల వసూలు, ఈ ఆఫీస్ మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల పై కలెక్టర్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పనుల ప్రతిపాదనలు తయారు చేశామని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వద్ద కొన్ని ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఆమోదించి ప్రతి పాఠశాల లో చేపట్టవలసిన పనులు ప్రాజెక్టు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమం అమలుపై రేపు ఉదయం సంపూర్ణ రివ్యూ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో 346 దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, 259 మంది లబ్ధిదారుల డాక్యుమెంటేషన్ పూర్తిచేసి యూనిట్లను మంజూరు చేశామని, 246 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నిధులు జమ చేస్తామని, మిగిలిన 13 మంది ఖాతాలలో రేపటి వరకు జమ అవుతాయని అధికారులు తెలిపారు. మిగిలిన 86 దళిత బంధువు యూనిట్ల డాక్యుమెంటేషన్ పూర్తిచేసి త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
వ్యవసాయ ట్రాక్టర్లు, ఇతర వాహనాల కొనుగోలు లబ్ధిదారులకు 9.9 లక్షల నగదు విడుదలకు అనుమతులు జారీ చేశామని, సర్వీస్ సెక్టార్ లోని పలు యూనిట్లకు 5 లక్షల వరకు నగదు విడుదలకు అనుమతులు ఇచ్చామని అధికారులు తెలిపారు. జిల్లాలో 90 యూనిట్ల లబ్ధిదారులు నిధులు విడుదల చేశారని , మండలాల్లో ఎంపీడీవోలు మండల ప్రత్యేక అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని దాని ప్రకారం బ్యాంకులు నిధులు రిలీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
10వ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు విద్యార్థులు తమ సామర్థ్యంతో మాత్రమే ఉత్తీర్ణత సాధించాలని, 10వ తరగతి పరీక్షల సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలించాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ సూచించారు.
మున్సిపాలిటీలో 100% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వసూలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో, మున్సిపాలిటీ లో ఆస్తి పన్ను వసూలు పై కలెక్టర్ చర్చించారు.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన సిసి రోడ్లు పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులతో చర్చించారు, వేసవి నేపథ్యంలో పనులు ఆలస్యం కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఉపాధి హామీ కార్మికుల పని కల్పన పురోగతి సాధించాలని, ప్రస్తుతం ప్రతి గ్రామంలో 95 మంది మాత్రమే ఉన్నారని, కనీసం 125 మందికి పని కల్పించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మున్సిపాలిటీలలో, గ్రామాల్లో అనుమతి లేకుండా ఉన్న పోస్టర్లను , హోర్డింగ్ బోర్డులను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులంతా హాజరయ్యే విధంగా వారి కార్యక్రమాల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రికార్డ్ చేయాలని, ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిన వెంటనే పేమెంట్ పూర్తి కావాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, జిల్లావ్యాప్తంగా గ్రామాల వారీగా మున్సిపాలిటీల వారీగా అక్రమ లేఅవుట్లు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. సీఎం ఆఫీస్ దరఖాస్తులు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లకు సంబంధించిన నివేదికలు కలెక్టర్ కార్యాలయంలో అందజేయాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న ఈ-ఆఫిస్ ఫైళ్ళు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ- ఆఫీస్ ద్వారానే ఫైల్ మూమెంట్ ఉండాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండల స్థాయి జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్ యంత్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయని, ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో కేంద్రాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం నాణ్యత అంశాలపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవసరమైన అవగాహన కల్పించ్చామని కలెక్టర్ తెలిపారు.
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఆర్.డి.ఓ.లు,జిల్లా అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.