కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని, జిల్లాలోని 18 సం॥లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్తో కలిసి రాజస్వ మండల అధికారులు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రస్తుతం కరోనా వైరస్ 3వ వేవ్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కరోనా వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో నవంబర్ 3వ తేదీ వరకు మొదటి డోస్ కార్యక్రమం ముగుస్తుందని, రెండవ డోస్ పూర్తి స్థాయిలో అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు జిల్లాలో సంబంధిత అధికారులకు కేటాయించిన ప్రాంతాలలో బృందాల ద్వారా, తెలిసిన వారిని తీసుకువెళ్ళి వ్యాక్సిన్ అందించాలని, చౌకధరల దుకాణాల డీలర్హు, ఆసరా ఫించన్ల జాబితా ప్రకారముగా ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సిన్ తీసుకొని గుర్తించి వాక్సినేషన్ చేయాలని, మొదటి, రెండు డోసుల వివరాలను కేటాయించిన ఫార్మాట్లో పొందుపర్పాలని అన్నారు. గ్రామపంచాయతీల వారిగా సర్వేతో పాటు మొదటి, రెండు డోసులు తీసుకునే వారిని గుర్తించి, వారికి వ్యాక్సిన్ అందించి సంబంధిత వివరాలను నిర్ణీత ఫార్మాట్లో పొందుపర్చి ప్రతి రోజు నివేదికను కలెక్టరేట్ కార్యాలయానికి పంపించాలని తెలిపారు. మైనార్టీలకు సంబంధించి ఆయా మత పెద్దల ద్వారా అందరికీ అవగాహన కల్పించి వ్యాక్సిన్ అందించాలని సూచించారు. కరోనా నియంత్రణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ నిర్వహణ విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కరోనా చికిత్స నిమిత్తం జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు, రాష్ష్రాల నుండి బాధితులు మంచిర్యాలకు వస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. గిరిజన కుగ్రామాలు, మైనార్టీ జనాభా ఉన్నచోట ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా వ్యాక్సిన్ పై పూర్తి స్థాయి అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ తీసుకునేలా అధికారులు చొరవ చూపాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.