DPRO ADB -ఫారెస్ట్ రైట్స్ కమిటీలు గ్రామాల్లోని ప్రజలకు చట్టం పై అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టం పై అవగాహన కల్పించాలని, అర్హులైన వారికీ లబ్ది చేకూరేలా కమిటీలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ నుండి మండల తహసీల్దార్ లు, అటవీ అధికారులు, విఆర్ఏ లతో అటవీ హక్కుల కమిటీల ఏర్పాటు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోడు భూములపై ప్రభుత్వ నిర్ణయం, చట్ట ప్రకారం అర్హులైన లబ్దిదారులకు అటవీ భూముల హక్కులను కల్పించేందుకు నిబంధనల మేరకు ఫారెస్ట్ రైట్స్ కమిటీ లను గ్రామస్థాయిలో ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఈ కమిటీలు గ్రామాలలోని ప్రజలకు అటవీ హక్కులపై విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. అర్హత కలవారికి భూముల యాజమాన్య హక్కు చెందేలా సాగు చేస్తున్న వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం, పూర్వాపరాలు, పత్రాలను పరిశీలించి డివిజనల్ స్థాయి కమిటీకి పంపించడం జరగాలని, తద్వారా డివిజనల్ స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా స్థాయి కమిటీకి సిఫారసు చేయడం జరుగుతుందని, తుది నిర్ణయం జిల్లా స్థాయి కమిటీకి మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ అంతను పారదర్శకంగా, సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 345 గ్రామస్థాయి సూపర్ వైజరి టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి టీమ్ లో పంచాయితీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ సహాయకులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లు ఉంటారని తెలిపారు. ఫారెస్ట్ రైట్స్ కమిటీలో పది నుండి పదిహేను మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏజెన్సీ లో వందశాతం షెడ్యూల్డు తెగలకు సంబందించిన వారు ఉంటారని, నాన్ షెడ్యూల్ ఏరియా లో 2/3 ఎస్టీలు, ఉంటారని ఈ కమిటీలలో 1/3 మహిళా సభ్యులు ఉండాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 728 గ్రామాలలో 56,140 ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉందని తెలిపారు. గ్రామస్థాయి సూపర్ వైజరి టీమ్ లు ఈ నెల 5 నుండి షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లోకి వెళ్లి ఫారెస్ట్ రైట్స్ కమిటీ పై అవగాహన కల్పిస్తూ కమిటీ ఏర్పాటు చేయాలనీ, ప్రస్తుత నిబంధనల ప్రకారం నవంబర్ 8 నుండి క్లెయిమ్ లను స్వీకరించడం, సర్వే చేయించడం జరగాలని, క్లెయిమ్ లను పరిశీలించి సబ్ డివిజినల్ స్థాయి కమిటీ లకు పంపించాలని అన్నారు. ఫారెస్ట్ రైట్స్ కమిటీ సమావేశం మినిట్స్ రికార్డు చేయాలనీ తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, 13 డిసెంబర్ 2005 ముందు సాగు చేస్తున్న వారు చట్టప్రకారం అర్హులని అన్నారు. ఫారెస్ట్ రైట్స్ కమిటీలో చదువుకున్నవారికి తీసుకోవాలని సూచించారు. గ్రామసభ నిర్వహించడంలో యాభై శాతం కోరం ఉండాలని సూచించారు. ప్రతి మండల టీమ్ మూడుసార్లు గ్రామాలను పర్యటించాలని సూచించారు. క్లెయిమ్ లు తీసుకునే ముందు సంబంధిత డాక్యుమెంట్ లు జతపరిచే విధంగా చూసుకోవాలని అన్నారు. ప్రతి ఒక వ్యక్తికీ పది ఎకరాలు మాత్రమే అర్హులని అన్నారు. జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ, 2005 డిసెంబర్ 13 కు ముందు షెడ్యూల్డు తెగలవారు సాగు చేస్తూ ఉండాలని, గిరిజనేతరులు 2005 నాటికీ ముందు 75 సంవత్సరాలు ఆ భూములు సాగు చేస్తున్నట్లు పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ భూములు నిరుపేదలు భూములేకపోతే బతకలేరు అన్నవాళ్లకు మాత్రమే ROFR పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన పత్రాలు రిజిస్టర్ లు, ఆయా టీమ్ లకు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ రాజేశ్వర్, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, అటవీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post