సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హై కోర్ట్ ప్రధానన్యాయ మూర్తి సతీష్ చంద్ర శర్మ దంపతులు హన్మకొండ లోని భద్రకాళి అమ్మవారి ఆలయానిక ఉదయం 8 గంటలకు చేరుకున్నారు. ఆలయ పూజారులు పుష్పగుచ్చాలతో సీజే దంపతులకు స్వాగతం పలికారు.
భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు న్యాయమూర్తులకు తలపాగ చుట్టి పూల మాలలు వేసి పూర్ణ కుంభం తో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఘనంగా ఆహ్వానం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం ప్రాంగణంలో శాలువా , పట్టు వస్త్రాలు, లడ్డు ప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్ర పటాన్ని వారికి బహుకరించారు. ఈ సందర్బంగా ఆలయ చరిత్ర , విశిష్టతను అర్చకులు వారికి వివరించారు.
అనంతరం అక్కడి నుండి నేరుగా వేయి స్థంబాల ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ పూర్ణ కుంభంతో వారికీ స్వాగతం పలికారు. అర్చకులు గర్భ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమం అనంతరం
అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందజేసి శాలువా పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాశస్త్యాన్ని అదే విధంగా శిల్పాల నిర్మాణ ప్రత్యేకతలను అర్చకులు వివరించారు. నిర్మాణ శైలిని ప్రొఫెసర్ పండురంగా రావు సీజే కి వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మునిసిపల్ కమిషనర్ ప్రావీణ్య, ఎండోమెంట్స్ ల్యాండ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం. వీరాస్వామి, తదితరులు పాల్గొన్నారు.