భవిష్యత్ తరాలకు పౌష్టికాహార లోపం లేని భావి పౌరులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు .
శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు, సూపర్వైజర్లు ,పోషణ అభియాన్ సిబ్బందితో పిల్లల ఎదుగుదల, పోషణ లోపం, తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ పిల్లలలో పోషణ లోపం లేకుండా తగిన పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. తక్కువ బరువు గల పిల్లల ఇంటి వద్దకు వెళ్లి ఇంటి వద్ద వారికి అవసరమైన పౌష్టికాహారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లల శాతం తగ్గించడం లో భాగంగా ప్రతి గురువారం అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. న్యూట్రిషన్ కు సంబంధించిన ఆహార పదార్థాలను, సంబంధిత చార్ట్స్ డిస్ప్లే చేయడంతో పాటు పిల్లల తల్లిదండ్రులకు పంచ సూత్రాలు పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
పౌష్టికాహార లోపం గల పిల్లలు ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో ఆయా కేంద్రాల పై సిడిపిఓలు, సూపర్వైజర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అన్ని అంగన్వాడీ కేంద్రాలలో వేయింగ్ మిషన్ సరిగ్గా పని చేసేలా చూసుకోవాలన్నారు. పౌష్టికాహార లోపం లేకుండా పిల్లలు ఎదిగేలా అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి పిల్లలకు అందిస్తున్న ఆహారంను వేర్వేరు సమయాల్లో చెక్ చేయాలన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించేలా చూడాలన్నారు. పిల్లలకు సరైన న్యూట్రిషన్ ఫుడ్ అందేలా చూడాలన్నారు . పిల్లలు వయస్సుకు తగ్గ ఎత్తు ,బరువు ఖచ్చితంగా ఉండాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, సి డి పి వో లు, సూపర్వైజర్లు, పోషన్ అభియాన్ అధికారులు పాల్గొన్నారు