మన ఊరు మనబడి పనుల పురోగతిని పెంచాలి – అదనపు కలెక్టర్ మను చౌదరి
మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ మనూ చౌదరి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మన ఊరు మనబడి పనుల పురోగతి, ఎఫ్టిఓల జనరేట్, మోడల్ స్కూల్స్ పనుల పురోగతి, తదితర అంశాలపై విద్య, ఇంజనీర్ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే పూర్తయిన సివిల్ వర్క్స్ తో పాటు పెయింటింగ్, సంప్, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ఫ్లోరింగ్ , ఫినిషింగ్, తదితర పనులు సొంత ఇంటి పని తరహాలోనే పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన ఉండేలా చొరవ చూపాలని సంబంధిత ఎంఈఓలకు సూచించారు.
మన ఊరు మనబడిలో చేపట్టిన మోడల్ స్కూల్స్ ను ఈ నెల 15 లోగా అన్ని హంగులతో పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే పనుల్లో జాప్యం జరిగిందని, పనులను నాణ్యతతో చేపడుతూ సత్వరమే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులలో జాప్యంపై పలు నియోజకవర్గాల ఈఈలు,
డిఈల పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వచ్చేవారం వరకు చూస్తానని, అప్పటికి పురోగతి లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తయిన పనులకు వెంట వెంటనే ఎఫ్టిఓ (పండు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్) లను అప్లోడ్ చేయాలని సూచించారు. పాఠశాల పెయింటింగ్ అంశంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం సూచించిన కలర్ కోడ్ రంగులు వేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డిఇఓ గోవిందరాజు, ఇంజనీరింగ్ శాఖల ఈఈలు దామోదర్ రావు, డిఈలు ప్రతాప్, దుర్గాప్రసాద్, ఎంఈఓలు, విద్యా శాఖ కో ఆర్డినేటర్ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.