మన ఊరు మురిసె.. మన బడి మెరిసె
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. నిన్న, మొన్నటి దాకా శిథిలావస్థలో కునారిల్లిన పాఠశాలలు సైతం నేడు అధునాతన హంగులతో కొత్త సొగసును సంతరించుకుంటున్నాయి. చూడముచ్చటైన తరగతి గదులు, క్లాస్రూంలో డ్యూయల్ డెస్క్లు.. విద్యుత్తు వెలుగులు.. పరిశుభ్రమైన టాయిలెట్లు.. స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంక్లు.. వంటగదులు.. భోజనశాలలు.. వాకింగ్ ట్రాక్లు.. చుట్టూ ప్రహరీలు.. ఇలా అనేక సదుపాయాలతో విద్యార్థులు ఏకాగ్రతతతో నిశ్చింతగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లాదకర వాతావారణాన్ని పంచిపెడుతున్నాయి. పిల్లల చదువులకు సరికొత్త భరోసాను అందిస్తున్నాయి. అసలు సిసలు సరస్వతీ నిలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
నారాయణపేట జిల్లాలో మొదటి విడతలో 174 పాటశాలలను ఎంపిక చేసుకోగా జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష పర్యవేక్షణలో 95 శాతం బడులలో పనులు పూర్తి అవడం గమనార్హం.
ప్రతి మండలంలో రెండు చొప్పున మోడల్ పాఠశాలలుగా ఎంపిక చేసి వాటికి అన్ని హంగులతో తీర్చిదిద్దగా రేపు జిల్లా ఇంచార్జ్ మంత్రులు, స్థానిక శాసన సభ్యులు, స్థానిక ప్రజా ప్రతి నిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. అన్ని హంగులతో ప్రైవేటు పాటశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కె దక్కుతుంది. పేదవారికి నాణ్యమైన చదువును అందించాలనే ఉదేశ్యం తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టిన ఘనత తెలంగాణా ప్రభుత్వానిది.