ప్రచురణార్థం
*మహబూబాబాద్ జిల్లాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డ్*
(ఢిల్లీ నుండి)
మహబూబాబాద్, ఏప్రిల్ – 21:
మహబూబాబాద్ జిల్లాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డ్ ను ప్రకటించారు.
గురువారం జాతీయ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డును ప్రకటించారు.
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ,* కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ – నామ్) ద్వారా విజయవంతంగా సేవలు అందిస్తున్నందుకు 2019 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య అవార్డ్ కొరకు దరఖాస్తు చేయగా, కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి పరిశీలన చేసి ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డ్ కు ఎంపిక చేసి ఇప్పుడు ప్రకటించారని తెలిపారు.
పంట ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో ఒకే రకమైన ధరను కల్పించాలనే లక్ష్యంతో ఈ-నామ్ ను ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ద్వారా పంట ఉత్పత్తులకు గరిష్ట ధర లభించడం, తూకంలో పారదర్శకత పాటించి అంతర మార్కెట్ లో ఆన్లైన్ టెండర్ ప్రక్రియలో క్రయ, విక్రయాలు ఈ నామ్ ద్వారా జరిపి రైతులకు ఆర్థికంగా లాభం చేకూర్చడంలో అందరి సమిష్టి కృషితో విజయవంతమైన సేవలు అందిస్తున్నందున జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు.
విజయవంతమైన సేవలు, సహాయ, సహకారాలు అందించి జిల్లాకు పేరు తీసుకొని రావడంలో తోడ్పాటునందించిన అప్పటి, ఇప్పటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కార్యదర్శి, సభ్యులు, ప్రజా ప్రతినిధులకు, వ్యవసాయ, జిల్లా అధికారులకు, మార్కెట్ యార్డ్ అధికారులకు, సిబ్బందికి, వ్యాపారులకు, రైతులకు అందరికీ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
—————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.