ప్రచురణార్ధం
నవంబరు 23. ఖమ్మం:–
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, చట్ట ప్రాధాన్యతను గుర్తించి క్షేత్రస్థాయిలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పసులను మరింత విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం చట్టం, పథకం యొక్క ప్రాధాన్యత పట్ల అవగాహన పెంపొందించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక టి.టి.డి.సి సమావేశ మందిరంలో ఎం.పి.డి.ఓలు, ఎం.పి.ఓలు, ఏ.పి.ఓలు, టెక్నికల్ అసిస్టెంట్లకు మంగళవారం నుండి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొని ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పథకం యొక్క ప్రాధాన్యత, చట్టం గురించి తెలియచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 15 సంవత్సరాల క్రితం ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ చట్టం తేవడం జరిగిందని, ఇప్పటికి పథకం ప్రాధాన్యత రోజు రోజుకు మరింత పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి భూములేని నిరుపేద కూలీలు, భూస్వాముల వద్ద పనిచేస్తే సరియైన కూలీ గిట్టుబాటు కాకుండా, సరియైన పనిదినాలు లభించకుండా ఉన్న పరిస్థితుల నుండి నిరుపేద కూలీలకు శాశ్వతంగా పనిదినాలు కల్పించి ఆర్ధికంగా బలోపేతం చేయడంతో పాటు, కమ్యూనిటీకి శాశ్వత సంపదను సృష్టించేందుకు విప్లవాత్మకంగా ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పథకం ద్వారా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ తెలిపారు. గ్రామ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టిగా ఉన్నప్పుడే సమాజం. మొత్తం ఆర్థికంగా బలోపేతంగా ఉంటుందని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం ద్వారా చేపడ్తున్న పనుల ప్రభావం స్పష్టంగా కల్పించాలని, ఎన్.ఆర్.ఇ.జి. ఎస్ పథకం ద్వారా చేపట్టే పనులకు ఎటువంటి పరిమితి లేదని, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులను ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా చేపట్టి నిరుపేద కూలీలను అధిక పనిదినాలు కల్పించే విధంగా ఎం.పి.డి.ఓలు మరింత బాధ్యతాయుంగా తమ విధులను నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన మాట్లాడుతూ జిల్లాలోని ఎం.పి.డి.ఓలు, ఎం.పి.ఓలు, ఏ.పి.ఓలు, ఈ.సి.లు, టెక్నికల్ అసిస్టెంట్లకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం. చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల 23వ తేదీ నుండి 25 వ తేదీ వరకు మూడురోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఒక్కొక్క బ్యాచ్ కు 55 మంది చొప్పున ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, చట్టంలో రూపొందించిన విధి విధానాల పట్ల కూలీలకు కల్పించబడిన హక్కులు, పని ప్రదేశాలలో కల్పించబడిన వసతులు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, కన్వర్జెన్సీ పనులు, మండల, గ్రామ స్థాయిలో రికార్డుల నిర్వహణ, గుడ్ గవర్నెన్స్ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి. అప్పారావు, ఎం.పి.డి.ఓలు, ఎం.పి.ఓలు, ఏ.పి.ఓలు, ఈ.సి.లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.