ఎన్నికల మీడియా సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
-000-
హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లో ఎన్నికల మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్లోని జిల్లా శిక్షణా కెంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలు సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎన్నికల తాజా సమాచారాన్ని అందించుటకు మీడియా సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా యంత్రాంగానికి చక్కగా సహకరిస్తూ ప్రజలకు సరి అయిన సమాచారాన్ని అందిస్తుందని అన్నారు. అదే సహకారాన్ని హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసే వరకు కొనసాగించాలని కలెక్టర్ కోరారు. ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన సమాచారంలో ఏమైనా అనుమానాలు ఉంటే జిల్లా పౌర సంబంధాల అధికారిని గాని, జిల్లా కలెక్టర్ గారిని గాని సంప్రదించి నిర్ధారించుకున్న తర్వాత వార్తలను ప్రచురించాలని కలెక్టర్ కోరారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను జిల్లా పౌర సంబంధాల అధికారి సమన్వయం చేస్తారని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రచురించు, ప్రసారం చేయు అడ్వర్టైజ్మెంట్లను మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎం.సి.ఎం.సి.) ఆమోదముతో ప్రచురించాలని ప్రసారం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పౌర సంబంధాల అధికారి అబ్దుల్ కలీం, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ సి.హెచ్. కొండయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి లక్ష్మా రెడ్డి, డివిజనల్ పౌర సంబంధాల అధికారి జె. శారద, తదితరులు పాల్గొన్నారు.