మైనారిటీ వర్గాలకై స్మశాన వాటికలకై స్థలాల పరిశీలించిన కలెక్టర్ హరీశ్
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలతో స్థలాల పరిశీలన
రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందచేత
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాతో పాటు హైదరాబాద్ నగర పరిసరాల ప్రాంతాల్లోని మైనారిటీలకు సంబంధించి స్మశాన వాటికల ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించామని… ఈ విషయమై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందచేస్తామని జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ కలెక్టర్ శర్మన్తో కలిసి హైదరాబాద్ నగర పరిసరాలతో పాటు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో స్మశాన వాటికలను ఏర్పాటు చేసేందుకు ఖాళీగా ఉన్న స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ… రాష్ట్ర పశుసంవర్ధక, సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థన మేరకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జిల్లాలోని బాల్నగర్ ప్రాంతంలో ఉన్న మైనార్టీలకు సంబంధించిన స్మశానవాటికలతో పాటు మరికొన్ని చోట్ల స్మశానవాటికలకు సంబంధించిన స్థలాలను పరిశీలించామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మైనార్టీవర్గాలకు సంబంధించిన స్మశానవాటికలు కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలతో తనతో పాటు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ స్థలాలను పరిశీలించామని వివరించారు. ఈ విషయమై మరో రెండు మూడు రోజుల్లో పూర్తిగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీవో మల్లయ్య, స్థానిక తహశీల్దార్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.