పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది: 14-09-2021
యప్ తాయారు చేసేస్థాయికి ఎదగాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన
నేడు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
అమెరికన్ యూనివర్సిటీతో కలిసి అందిస్తున్న టీటా
జిల్లావ్యాప్తంగా రెండు వేల మంది సర్కారీ బడుల విద్యార్థులు, ఉపాధ్యాయులకు నూతన నైపుణ్యాలు
సందీప్ మఖ్తల కృషిని ప్రశంసించిన జిల్లా కలెక్టర్
సర్కారీ బడుల విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు, వారు అధునాతన అంశాల్లో పట్టు సాధించేందుకు కోడింగ్ సబ్జెక్టులో శిక్షణ ఇచ్చే భారీ కార్యక్రమాన్ని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) నేడు ప్రారంభించింది. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తలతో కలిసి కలెక్ేర్ దాసరి హరిచందన నేడు ప్రారంభించారు. టీఎస్టీఎస్తో కలిసి అందిస్తున్న ఈ శిక్షణ జిల్లావ్యాప్తంగా 2013 మంది సర్కారీ బడుల విద్యార్థులు, ఉపాధ్యాయులకు నూతన నైపుణ్యాలు అందించనుంది. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తలను కలెక్టర్ దాసరి హరిచందన అభినందించారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కోడింగ్ నైపుణ్యాలు నేర్చుకొని తదుపరి దశలో తమ తమ పాఠశాలల్లోని విద్యార్థులకు సైతం అదే ఒరవడిలో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
నారాయణపేట్ జిల్లాలోని 61 పాఠశాలలను ఎంచుకొని 183 భాగస్వామ్యులను గుర్తించారు. వీరు నేరుగా శిక్షణ పొంది ఒక్కో పాఠశాలలో 30 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తంగా 2013 మందిని కోడింగ్ అక్షరాస్యులుగా టీటా తీర్చిదిద్దనుంది. కోర్సు పూర్తయిన అనంతరం ఉత్తీర్ణులకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ డెల్లస్ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వనుంది. ఒక జిల్లాలో ఇంత మంది విద్యార్థులను భారీ స్థాయిలో తీర్చిదిద్దడం, అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో, పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తీర్చిదిద్దడం దేశంలో ఇదే మొట్టమొదటి సారి. ఈ కోడింగ్ శిక్షణ కార్యక్రమంలో స్క్రాచ్ , పైథాన్ కోర్సులు నేర్పుతున్నారు. టీఎస్టీఎస్ ఈ కోర్సుకు సహకారం అందిస్తోంది. జిల్లాలోని 120 హైస్కూల్ లలో ప్రతి స్కూల్కు ఒక స్మార్ట్ టీవీని మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో తీసుకురావడంలో సందీప్ మఖ్తల సహకారం అందించారు. జిల్లాలోని మఖ్తల్ , మద్దూరు, నారాయణపేట్ మండలాల్లో ఈ కోర్సు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ శిక్షణలో భాగంగా ల్యాప్ ట్యాప్ ద్వారా విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలు నేర్పించనున్నారు.
జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ, నారాయణపేట్ జిల్లా వాస్తవ్యుడు కాబట్టి మాతృభూమిపై అభిమానంతో సందీప్ మఖ్తల ఈ జిల్లా అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కోర్సుకు 25,000-30,000 ఫీజు వసూలు చేస్తున్న పరిస్థితుల్లో ఇంత భారీ ఫీజు గల కోర్సు ఉచితంగా పొందుతున్నందుకు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ ఇక్కడ ఉండి శిక్షణ ఇవ్వడం ప్రశంసనీయమని కలెక్టర్ అభినందించారు. శిక్షణ కొనసాగుతున్న సమయంలోనూ తాను సందర్శిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా విద్యాధికారి లియాఖత్ ఖాన్, విద్యాసాగర్, శ్రీనివాస్, యాదయ్య తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన కోడింగ్ శిక్షణ పైలెట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా మఖ్తల్ , మద్దూరు, నారాయణపేట్ మండలాల్లోని తదుపరి శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాకు చెందిన యూటీడీ మరియు టీఎస్టీఎస్ ఈ కోడింగ్ శిక్షణకు ముందుకు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వెనకబడిన జిల్లాకు చెందిన సర్కారీ బడుల విద్యార్థులు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చెందనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి దశలో మరిన్ని జిల్లాల్లో ఈ శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.