ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు క్షేత స్థాయిలో దృష్టి సారించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పి.సి.సి.ఎఫ్. ఆర్.శోభ, శాసన మండలి సభ్యులు దండె విఠల్, శాసనసభ్యులు, దయాకర్రావు, రేఖాశ్యాంనాయక్, రాథోడ్ బాఫురావు, ఆత్రం సక్కు దుర్గం చిన్నయ్య, పి.సి.సి.ఎఫ్. సోషల్ ఫారెష్ట్ర ఆర్. ఎం. దోబ్రియల్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్లో రోడ్ల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులపై నాలుగు జిల్లాల కలెక్టర్లు, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, ఆదిలాబాద్ సి.ఎఫ్., డి.ఎఫ్.ఓ.లు, ఎఫ్.డి.ఓ.లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సమన్వయంతో పని చేయాలని, రహదారుల నిర్మాణానికి సంబంధించి యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, అటవీ అనుమతులు తదితర అన్ని అంశాల పనులను వేగవంతం చేయాలని, సమన్వయ లోపం లేకుండా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పనులు పూర్తి చేయాలని, గిరిజన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణాలలో అలసత్వం వహించకుండా సంబంధిత అనుమతులతో పనులు చేపట్టాలని తెలిపారు. పెండింగ్ సమస్యలను జిల్లాల వారిగా విచారించి నివేదిక తయారు చేయాలని, ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా స్థాయి నుంచి సరియైన రూపంలో ప్రతిపాదనలు పంపించాలని, ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, జాబితా రూపొందించి, ఉన్నతాధికారులకు సమర్పించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసరవ పరిస్థితులలో తక్షణమే వైద్య సేవలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, పరిస్థితులను బట్టి అధికారులు మానవతా ధృకృథంలతో వ్యవహరించాలని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలని, నిబంధనలు పాటిస్తూనే ప్రజాప్రతినిధులకు సహకరించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, బాధ్యత, జవాబుదారితనంతో వ్యవహరించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మరింత వేగవంతం చేసే దిశగా కృషి చేస్తామని, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులతో పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోడ్డు-భవనాలు, పంచాయతీ రాజ్, నీటి పారుదలశాఖల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.